ఎమ్మెల్సీ ఎన్నికల ట్విస్ట్: తెలంగాణ మంత్రి తలసాని టీడీపీ ఎమ్మెల్యేనే
హైదరాబాద్: శాసన సభ్యుల (ఎమ్మెల్యే) కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు లిస్ట్ను అసెంబ్లీ కార్యదర్శి సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా పేర్కొన్నారు. తలసాని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున సనత్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. తలసానితో పాటు ధర్మారెడ్డి, తీగల కృష్ణా రెడ్డి వంటివారు కూడా కారు ఎక్కారు.
ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయా ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినవారో చెప్పే కాలం ఉంటుంది. దీనిని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం తప్పించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారో చెప్పే కాలంలో తాజాగా.. తలసానిని టీడీపీ ఎమ్మెల్యేగా పేర్కొన్నారు.
తప్పని పోటీ
ఎమ్మెల్యే కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. అయితే, ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో పోటీ తప్పని పరిస్థితి అవుతోంది. తెరాస ఐదుగురు, కాంగ్రెస్, టీడీపీలో చెరో ఒక్క అభ్యర్థిని నిలబెట్టాయి. మజ్లిస్ తెరాస అభ్యర్థికి, బీజేపీ టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తున్నాయి.
తెరాసకు ఉన్న స్థానాల ప్రకారం ఆ పార్టీ నలుగురు అభ్యర్థులను నిలబెట్టడం కూడా ఎక్కువేనని విపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్ష సభ్యులను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థికి ఓటు హక్కు లేదని విపక్షాలు చెబుతున్నాయి. ఆయన ఓటును కూడా తెరాస లెక్కలోకి తీసుకుంటుందని ఆరోపిస్తున్నాయి.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై టీటీడీపీ న్యాయపోరాటం
మరోవైపు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ టీడీపీ న్యాయపోరాటానికి దిగింది. ఎమెల్మీ ఎన్నికల నేపథ్యంలో తలసాని, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలను ఓటింగ్కు అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో సోమవారం హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది.
తలసానితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడమే ఫిరాయింపునకు సాక్ష్యమని కోర్టుకు టీడీపీ వివరించింది. నాలుగు నెలల క్రితమే వీరిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పిటిషన్ను సింగిల్ బెంచ్లో కొట్టివేయగా, డివిజనల్ బెంచ్ను ఆశ్రయించింది.
దీంతో పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన అందరికీ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కదలికలు లేకపోవడం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తుండటంతో టీడీపీ వేగంగా పావులు కదుపుతోంది.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ముగ్గిరిని ఓటుకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో అన్ని అవకాశాలను టీడీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వారికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ముగ్గురిని ఓటింగ్కు అనర్హులుగా ప్రకటించాలని హౌస్మోషన్లో కోరినట్లు తెలుస్తోంది.