పులివెందులకు విజిటింగ్ ప్రొఫెసర్లా: జగన్పై సతీష్రెడ్డి
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు విజిటింగ్ ప్రొఫెసర్లా ఏడాదికి ఒకసారి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆదివారం దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారన్నారు. ఆరేళ్ల పాటు అధికారంలో ఉండి పులివెందులకు మంచినీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. జిల్లా సమస్యలు పరిష్కరించకుండా జగన్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడమేంటన్నారు. జగన్ ప్రజల్ని పట్టించుకోవడం లేదన్నారు.
జగన్ పైన పరకాల ఆగ్రహం
జగన్కు జనం బాధలు పట్టడం లేదని, ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారుల బృందానికి ప్రభుత్వం అన్ని వివరాలు అందచేసిందన్నారు.
కేంద్రం నుండి ఎంత సాయం కావాలో అడిగామన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుండగా జగన్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. కరవుకు గురైన రైతుల సమస్యలు కేంద్రానికి తెలియచేసి, ప్రతిపక్ష పార్టీ అధినేతగా కేద్రం నుండి నిధులు తెచ్చేందుకు ప్రయత్నించాల్సిన జగన్ నిర్లక్ష్యంగా ప్రవర్తించారన్నారు. కేంద్ర బృందానికి ఒక దరఖాస్తుకూడా ఇవ్వలేకపోయారన్నారు.
ప్రధానమంత్రి వద్దకు వెళ్లిన జగన్ పట్టిసీమకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరడం దారుణమని పరకాల అన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు లాభం చేకూరుతుందే తప్ప ఇతరులకు ఎవరికీ అన్యాయం జరగదన్నారు. ఈ పరిస్థితిలో ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రజలను, ఇతర రాష్ట్రాలను పట్టిసీమను వ్యతిరేకించండంటూ జగన్ ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.