పోలవరం లెక్క తప్పుతోందా? బాబుపై అనుమానం!: ప్రత్యేక నిఘా పెట్టిన మోడీ
కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర సర్కార్ ఏవిధంగా ఖర్చు పెడుతోంది? ప్రాజెక్టు కోసమే ఖర్చు పెడుతున్నారా? లేక పక్కదారి పడుతున్నాయా! వంటి విషయాలను ఈ ఉన్నతస్థాయి కమిటీ నిశితంగా పరిశీలించి.. ఎప్పటికప్పుడు
అమరావతి: మూడేళ్ల తేడాలో పోలవరం అంచనా వ్యయం అనూహ్య రీతిలో పెరిగింది. పెరిగిన అంచనాతో కేంద్రం సంబంధం లేదని చేతులు దులుపేసుకుంది. మరోవైపు 2018నాటికి పోలవరం పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు అండ్ కో ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.
బాబుకు కేంద్రం షాక్: పోలవరం అంచనా పెరిగితే.. రాష్ట్రమే భరించాలి!
అదే సమయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం సడలినట్లుగా కనిపిస్తోంది. పట్టుబట్టి మరీ పోలవరాన్ని చంద్రబాబు సర్కార్ తన గుప్పిట్లో పెట్టుకోవడం వెనుక ఆంతర్యమేంటో కేంద్రానికి తెలిసొచ్చినట్లుంది. ఇంకేం.. మరో ఉన్నత స్థాయి కమిటీతో ప్రధాని మోడీ పోలవరంపై నిఘా పెట్టారు. ఇప్పటికే ఉన్న కమిటీలకు తోడు ఒక్క పోలవరం ప్రాజెక్టు పైనే ఇది మూడో కమిటీ కావడం గమనార్హం.
ఉన్నతస్థాయి కమిటీతో నిఘా:
కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర సర్కార్ ఏవిధంగా ఖర్చు పెడుతోంది? ప్రాజెక్టు కోసమే ఖర్చు పెడుతున్నారా? లేక పక్కదారి పడుతున్నాయా! వంటి విషయాలను ఈ ఉన్నతస్థాయి కమిటీ నిశితంగా పరిశీలించి.. ఎప్పటికప్పుడు మోడీకి నివేదికలు పంపించనుంది. కేంద్ర జలసంఘం సభ్యుడు మన్సూర్ ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ కమిటీలో..ఐదుగురు సభ్యులు, నలుగురు చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. వీరితో పాటు ప్రాజెక్టు డిజైన్ కమిటీ ఛైర్మన్ కూడా ఇందులో ఉంటారు.
రాయపాటిపై ఆరోపణలు:
కాగా, కాంగ్రెస్ హయాంలోను పోలవరం ప్రాజెక్టుకు కాంట్రాక్టర్ గా వ్యవహరించిన ఎంపీ రాయపాటి సాంబశివరావే ఇప్పుడు కూడా ప్రధాన కాంట్రాక్టరుగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు పనే మొదలుపెట్టకుండా..అప్పట్లో ప్రభుత్వం నుంచి బిల్లులు మాత్రం పొందారు రాయపాటి. రాయపాటి కంపెనీకి పోలవరం నిర్మించే సత్తా లేదని స్వయంగా స్టేట్ లెవల్ స్టాడింగ్ కమిటీ తేల్చి చెప్పినా అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
సీన్ మారింది:
రాయపాటి కంపెనీకి పోలవరం నిర్మించే సామర్థ్యం లేదని స్టేట్ లెవల్ స్టాడింగ్ కమిటీ చెప్పడంతో.. అప్పట్లో చంద్రబాబు సైతం రాయపాటిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తీరా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. రాయపాటి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో.. విమర్శించిన నోటితోనే చంద్రబాబు ఆయన్ను సమర్థించే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనకే పోలవరం పనులు కట్టబెట్టారు.
బాబు పాత్రపై అనుమానం:
మళ్లీ పాత కాంట్రాక్టరుకే చంద్రబాబు పనులు అప్పజెప్పడం.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్రమే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నా.. చంద్రబాబు పట్టుబట్టి మరీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేలా పావులు కదపడం కేంద్రానికి అనుమానం తలెత్తేలా చేసినట్లుంది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై కేంద్రానికి అనుమానాలు ఉండటం వల్లే ఈ కొత్త కమిటీని వేసిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.