మేం శభాష్, ముగ్గురు ఎవరికివారే: ఆ పత్రికలో కేసీఆర్కు 90మార్కులు!
హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మరో నాలుగైదు రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మరో పది రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రభుత్వాలు సొంత డబ్బా కొట్టుకుంటున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏడాది పాలనలో చేసిందేమీ లేకపోయినప్పటికీ ఏదో సాధించినట్లు చెబుకుంటున్నారని పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.
పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ వల్ల ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించారు. మోడీ పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ ఏడాది కాలంలో మోడీ విదేశాల్లో పర్యటించడం మినహా ఏం చేయలేకపోయారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందులోను అభివృద్ధి లేదని అంటున్నారు.
అయితే, బీజేపీ నాయకులు మాత్రం తాము ఎంతో సాధించామని చెబుతున్నారు. మోడీ ఏడాది పాలనలో ప్రపంచంలో భారత దేశానికి ప్రతిష్ట తెచ్చారని, స్పష్టత, పారదర్శకత పాటించామని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెబుతోంది. అన్నింట పారదర్శకత పాటించామని చెబుతున్నారు.
అయితే, యూపీఏ 1 హయాంలోను ఆ ప్రభుత్వం ఏడాది పాలన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని, ఆ తర్వాత అసలు విషయం తెలిసిందని, ఈ నేపథ్యంలో మోడీ పాలనలో ఏం జరిగిందనేది కొద్ది రోజులు తర్వాత తెలుస్తుందని కొందరు అంటున్నారు. బీజేపీ సొంత డబ్బా కొట్టుకుంటోందని విమర్శిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల పైన విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కేసీఆర్ తన ఏడాది పాలనలో వివాదాస్పద అంశాలతో పతాక శీర్షికలకు ఎక్కారని అంటున్నారు. ఆది నుండి కేసీఆర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి పలు అంశాల్లో వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే, ఏడాదిలోనే ఏం చేశారనే విషయం చెప్పడం కష్టమేనని కొందరు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. సచివాలయం తరలింపు, సాగర్ చుట్టూ బహుళ అంతస్థుల భవనాలు, వినాయక సాగర్ ఏర్పాటు, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం, సమగ్ర సర్వే తదితరాలు విపక్షాలకు పని చెప్పాయి.
కొద్ది రోజుల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను కేసీఆర్ తీసుకుంటామని చెప్పడంతో విపక్షాలకు తోడు విద్యార్థి లోకం కూడా భగ్గుమంటోంది! ఓయు రగడ రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని మరికొందరు భావిస్తున్నారు.
అదే సమయంలో ఏడాది పాలనలో తాము ఎంతో చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. విభజన జరిగితే హైదరాబాదు నుండి వెళ్లగొడతారని బెదిరించారని, కానీ ఏడాదిలో అలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదని, మండు వేసవిలో కోతలు లేకుండా విద్యుత్ ఇస్తున్నామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెబుతున్నారు.
కేసీఆర్ పత్రికగా చెప్పే నమస్తే తెలంగాణలో గురువారం నాడు శభాష్ కేసీఆర్ అంటూ ఓ ఆర్టికల్ వచ్చింది. అందులో కేసీఆర్ పాలనకు జనాలు జేజేలు పలుకుతున్నారని, ప్రజలు వందకు 90 మార్కులు వేశారని పేర్కొన్నారు. సీమాంధ్రుల పాలన కంటే తెలంగాణ పాలన బెట్టర్ అని 93 శాతం మంది అభిప్రాయపడ్డారని పేర్కొంది.
ఏపీలో.. చంద్రబాబు ఏడాది కాలంలో రాజధాని హడావుడి తప్ప చేసిందేమీ లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలో మిత్రపక్షంగా ఉంటూ కూడా ప్రత్యేక హోదాను ఇప్పటి వరకు సాధించలేదని మండిపడుతున్నారు.
రాజధాని భూముల వ్యవహారం, భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ, బాబు కార్యాలయాలకు పెద్ద ఎత్తున ఖర్చులు చేయడం తదితరాలు విపక్షాల నోటికి పని చెప్పాయి. ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ కూడా రాజధాని భూముల వ్యవహారంపై చంద్రబాబును నిలదీశారు.
అయితే, ఏడాది కాలంలో తాము ఎంతో చేశామని టీడీపీ చెబుతోంది. సింగపూర్ చేత ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయించామని, కేంద్రానికి అనుకూలంగా ఉంటూనే పనులు చేసుకుంటున్నామని చెబుతోంది. రుణమాఫీతో రైతులకు ఊరట కల్పించామని చెబుతున్నారు.