మోడీతో జగన్ భేటీ: గుప్పుమన్న ఊహాగానాలు, దోస్తీకేనా?
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంతో దోస్తీపై ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. నెలన్నర క్రితం జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మోడీ ఇష్టపడలేదు. అయితే, సోమవారంనాడు జగన్ మోడీని కలుసుకునే అవకాశం వచ్చింది. పార్టీ పార్లమెంటు సభ్యులతో కలిసి జగన్ మోడీతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత మోడీ, జగన్ ఇరువురు పది నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమయ్యారు.
జగన్ ఏకాంతంగా మోడీతో భేటీ కావడంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కొద్ది రోజుల క్రితం లేపాక్షి నాలెడ్జ్ హబ్, రాంకీ ఫార్మా సిటీ ఆస్తులను జప్తు చేసింది. కేసుల నుంచి బయటపడడానికే జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు వర్గాల మరో విధంగా ఉంది. బిజెపి తెలుగుదేశం పార్టీతో విసిగిపోయింది. దీంతో బిజెపి వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తోందని అంటున్నాయి. నిజానికి జగన్ ఫిబ్రవరి 17వ తేదీన తన పార్టీ ఎంపీలతో కలిసి మోడీని కలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ మోడీ వారికి సమయం ఇవ్వలేదు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ను, అరుణ్ జైట్లీని కలుసుకుని వెనుదిరిగారు.
అయితే, జగన్ ప్రధానిని కలుసుకోవడానికి ముందు కొంత కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి సన్నిహితులైన కొంత మంది రాయబారం నడిపినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టదలిచిన ఆందోళన విషయంలో జగన్ తన మనసు మార్చుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన సిపిఐ, సిపిఎంలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పుడు సొంతంగానే ఆందోళనకు దిగుదామని జగన్ తన పార్టీ నాయకులకు చెప్పినట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెసు, బిజెపిలు దగ్గరవుతున్నాయని చెప్పడానికి అదే నిదర్శనమని అంటున్నారు. అంతేకాకుండా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై ప్రతిపాదించ దలుచుకున్న అవిశ్వాస తీర్మానాన్ని జగన్ వెనక్కి తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన నుంచి టిడిపి వెనక్కి తగ్గింది. ఈ విషయంలో బిజెపి శాసనసభ్యుడు ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిగా పనిచేసినట్లు చెబుతున్నారు.
సోమవారంనాడు మీడియాతో మాట్లాడిన జగన్ - ఎన్డీయెతో, ప్రధానితో సన్నిహిత సంబంధాలను కొనసాగించడంలో తప్పేమీ లేదని అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ రాజకీయ సమీకరణాలను మార్చుకునే ఉద్దేశం లేదని బిజెపి అంటోంది. అయినప్పటికీ, జగన్ మోడీతో భేటీ అయిన విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.