జగన్ రాసి లేఖ లీకు చేసిందెవరు: మోడీ సీరియస్?
తన కార్యాలయం నుంచి జగన్ తనకు సమర్పించిన లేఖ లీక్ కావడంపై ప్రధాని మోడీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి నేతలు కూడా గుర్రుగా ఉన్నారు.
విజయవాడ: తనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన లేఖ లీక్ కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి వర్గాలు కూడా ఈ లీకు వ్యవహారంపై గుర్రుగా ఉన్నాయి. ఆ లేఖను లీక్ చేసిందెవరనే విషయాన్ని ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
చదవండి: షాకింగ్: కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!!
జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ లీక్ చేసే అవకాశం లేదు. అదే సమయంలో జగన్కు లీక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లేఖను లీక్ చేసిందెవరు అంత అవసరం ఎవరికి ఉందనే విషయాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక ప్రధాని కార్యాలయం (పిఎంవో) నుంచి ఆ లేఖ లీకయ్యే అవకాశం ఉంది. అయితే, పిఎంవోను ప్రభావితం చేయగల నాయకులెవరనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. జగన్ ప్రధానికి సమర్పించిన లేఖలు లీకయై ఆంధ్రజ్యోతిలో వార్తాకథనాలు రావడంతో పెద్ద దుమారం చెలరేగుతోంది. దీంతో ఆ లేఖల లీక్పై ప్రధాని సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా జరుగుతుంది...
రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రముఖులు ప్రధానిని కలిసే సందర్భంలో వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. తమ ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రధాని అందుబాటులోకి రాకపోతే తమ లేఖను పీఎంఓకు ఇస్తుంటారు. తమ వాదనకు మద్దతుగా ఉన్న ఆధారాలను కూడా జోడిస్తారు. తర్వాత ప్రధాని వాటిని పీఎంఓ అధికారుల పరిశీలనకు పంపుతుంటారు. అటువంటి ప్రముఖుల వినతిపత్రాల అంశాలపై తమ స్పందన, పురోగతిని పీఎంఓ లిఖితపూర్వకంగా వారికి లేఖ రూపంలో పంపుతుండటం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రముఖులు సమర్పించే లేఖలను, వినతిపత్రాలను బయటకు రానీయరు. అవన్నీ పీఎంఓలోనే భద్రపరుస్తుంటారు.
కానీ అది లీకైంది...
వైయస్ జగన్ ఇచ్చిన వినతిపత్రం డాక్యుమెంటు సహా లీక్ కావడం రాజకీయ వర్గాల కలవరానికి కారణమైంది. తాజా లీక్ వ్యవహారం తెలుగు మీడియాలో ప్రముఖంగా రావడంతో కంగు తిన్న రాష్ట్ర బిజెపి నేతలు కొందరు ఈ విషయాన్ని బిజెపి నాయకత్వానికి చేరవేశారు. వారు సైతం దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసి, దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇది ఏ స్థాయిలో జరిగింది, ఎలా లీకయిందనే విషయాలను తేల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వివాదం ఇలా...
మీడియాలో వచ్చిన లేఖ తాజాగా మోడీతో జగన్ జరిపిన భేటీలో ఇచ్చింది కాదని ఫిబ్రవరి 17న రాసిన లేఖ అని, దానికి ఏప్రిల్ 17న పీఎంఓ నుంచి జవాబు వచ్చిందని, తాము ప్రధానిని కలిసి ఇచ్చిన వినతిపత్రం మే 10న అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. నాటి లేఖను సంపాదించి, దానిని మొన్నటి భేటీకి ముడిపెట్టిన ఆ పత్రిక, చానెల్పై క్రిమినల్ చర్యలుంటాయని చెప్పారు. సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన జగన్ కూడా అదే చెప్పి నాటి లేఖలు విడుదల చేశారు. అదే నిజమనుకున్నా ఆ లేఖ కూడా పీఎంఓ నుంచి ఎలా లీకయిందన్న ప్రశ్నకు జవాబు విచారణలో తేలాల్సి ఉంది.
జగన్ కూడా...
రాష్ట్ర బిజెపి నాయకులు చెబుతున్న విషయాల ప్రకారం తెలుగుదేశం అనుకూల వర్గానికి చెందిన కొందరు ప్రముఖులకు పీఎంఓతో సంబంధాలున్నాయని, వారే సదరు మీడియాకు లీక్ చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రజ్యోతి మీడియా చాలాకాలం నుంచి బిజెపి, మోదీతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం వ్యతిరేక వైఖరితో ఉన్న నాయకులపై ఒక వ్యూహం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రధాని కార్యాలయ లొసుగును బట్టబయలు చేయగా, ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్న పలువురు ప్రముఖులను ఆత్మరక్షణలో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.