టిటిడి ఈవో ఇష్యూ: ఇలా.. పవన్ కళ్యాణ్కు మరో షాక్ ఇచ్చిన మోహన్ బాబు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన మోహన్ బాబు.. అంతటితో ఆగలేదు. కొత్త ఈవోకు ఆయన లేఖ కూడా రాశారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన మోహన్ బాబు.. అంతటితో ఆగలేదు. కొత్త ఈవోకు ఆయన లేఖ కూడా రాశారు.
తెలుసుకో: బీజేపీ, పవన్ కళ్యాణ్ 'ఉత్తరాది'పై మోహన్ బాబు గట్టి ఝలక్
తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఈవోగా ఎంపికైనందుకు నేను చాలా ఆనందిస్తున్నానని, నిజాయతీ, నిబద్ధత, అంకితభావంతో సమాజాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు మీరు సమగ్రంగా పని చేశారని, అదంతా కూడా విశాఖపట్నం, మెదక్, తూర్పు గోదావరి జిల్లాలకు కలెక్టరుగా పని చేసినప్పుడు కనిపించిందని ప్రశంసించారు.
తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా పేరు
ప్రపంచ వ్యాప్తంగా టీటీడికి ఎంతో పేరు ఉందని, ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత కోసం, భక్తులను సంతోష పరిచేలా కార్యకలాపాలు నిర్వహించడం కోసం సమర్థమైన నాయకత్వం అవసరమని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఉత్తరాది అనడం సరికాదు
ఆ దిశగా మీరు సమర్థంగా పనిచేస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని మోహన్ బాబు ఈవోపై విశ్వాసం ఉంచారు. దేవుడికి ప్రాంతానికి సంబంధం లేదని, తిరుపతి దక్షిణాదిలోనే ఉన్నా ఉత్తారాది వారిని నియమించారని వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు.
చూడాల్సింది అది
ఈ ప్రాంతం వారినే టీటీడీకి ఈవోగా నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, భాష వస్తుందా? రాదా? అన్న విషయాన్ని పక్కన పెట్టి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారా లేదా అన్నదే చూడాలని మోహన్ బాబు పేర్కొన్నారు.
మీకు సహకారం...
కాబట్టి ఇలాంటి పవిత్ర క్షేత్రానికి మిమ్మల్ని ఈవోగా నియమించడాన్ని సమర్థిస్తున్నానని, ఈ దిశగా అందరి తరఫునా మీకు సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నానని కొత్త ఈవోకు అనిల్ సింఘాల్కు ఆయన లేఖ రాశారు.
తనను తాను పరిచయం చేసుకున్న మోహన్ బాబు
మోహన్బాబు ఈవోకు తనను తాను పరిచయం చేసుకున్నారు కూడా. తాను తెలుగులో ప్రముఖ నటుడినని, గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేశానని, ప్రస్తుతం పేద విద్యార్థుల కోసం శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో ట్రస్టు ద్వారా జరిగే కార్యక్రమాలకు అతిథిగా వస్తే తమకు గౌరవం అని ఆయన ఈవోకు లేఖ ద్వారా తెలిపారు.