చంద్రబాబుతో చర్చలు: సైకిలెక్కనున్న మోహన్ బాబు?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చంద్రబాబుతో గంటకుపై చర్చలు జరిపారు. నారావారిపల్లెలో వారి మధ్య భేటీ జరిగింది. దీంతో ఆయన టిడిపిలో చేరుతారా అనే చర్చ సాగుతోంది.
చిత్తూరు: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో సైకిలెక్కుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
సంక్రాంతి పర్వదినం రోజున మోహన్ బాబు నారావారి పల్లెలో చంద్రబాబుతో మోహన్ బాబు గంటకుపైగా మాట్లాడారు. సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు తన స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చారు. అయితే, తాను కేవలం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే వచ్చానని, ఇందులో ఏ విధమైన రాజకీయం లేదని మోహన్ బాబు భేటీ తర్వాత చెప్పారు.
అయితే, మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలోకి వస్తానని చంద్రబాబుతో చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా వ్యవహరిస్తానని మోహన్ బాబు చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే, తాను ఏ పార్టీలో చేరేది మాత్రం చెప్పలేదు. చంద్రబాబును కలవడంతో ఆయన టిడిపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
మోహన్ బాబు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఆయన అత్యంత ఆత్మీయతతో వ్యవహరించేవారు దాంతో ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.