స్కూలుకు వెళ్లలేదని వాతలు పెట్టిన తల్లి, గుంటూరులో స్వల్ప భూకంపం
విజయవాడ: పాఠశాలకు వెళ్లనని మారాం చేసిన కన్న కొడుకుని బుజ్జగించి, బతిమాలి స్కూలుకు పంపాల్సిన ఓ కన్న తల్లి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. పాఠశాలకు వెళ్లనని మొండికేసిన కొడుక్కి వాతలు పెట్టిన సంఘటన విజయవాడలోని సింగ్ నగర్లో జరిగింది.
పాఠశాలకు వెళ్లలేదని బాలుడికి తల్లి వాతలు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న స్ధానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు బాలుడిని తమ సంరక్షణలో ఉంచారు.
బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్ల పంపిణీ: కలెక్టరు బాబు
కృష్ణా జిల్లాలో 8 వేల మందికి ఏప్రిల్ నెలలో పెన్షన్లను బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టరు బాబు వెల్లడించారు. 99.5 శాతం పెన్షన్ల పంపిణీతో ఏపీలోనే కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
గుంటూరులో స్వల్ప భూకంపం... పరుగులు చేసిన ప్రజలు
గుంటూరులోని శ్యామలాపురం ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయంతో స్ధానికులు ఇళ్లను వీడి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాలతో పాటు, కొన్ని ఇతర ప్రాంతాలు కూడా ప్రమాదకర భూకంపాల జోన్లో ఉన్నాయని గతంలోనే భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం కూడా ఇదే జోన్లో ఉందని కూడా వారు వివరించారు.