ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన... అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మాఆర్పీఎస్ నాయకులు ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ఎదుట ఆందోళనకు యత్నించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన ఎమ్మాఆర్పీఎస్, గత కొంతకాలంగా వ్యతిరేకత కనబరుస్తోంది.
ఇక శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం... ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లాల్లో బోధన్, నబీపేట్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో నిరసనకు దిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు కోపంతో చితకబాదారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు చెందిన వాహనం అద్దాలను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.