'మంత్రులు బతుకుదెరువు కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు భజన'
అమరావతి: ఏపీ మంత్రులు తమ బతుకుదెరువు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భజన చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ ఆగస్టులోగా కాపు రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాపు భవానాలకు చంద్రన్న పేరు పెట్టే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయలేదంటూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 'కాపు భవనాలకు చంద్రన్న పేరు ముఖ్యమంత్రి ఆలోచనే' అని ముద్రగడ ఆరోపించారు.
ముద్రగడ ఉద్యమం కొత్త మలుపు: కాపులంతా ఏకం అవుతారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకే తాను ఉద్యమం చేస్తున్నానని చెప్పుకొచ్చిన ముద్రగడ, కాపు జాతికి ఛాంపియన్ కావాలనుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. 'మాటి మాటికీ జగన్ జగన్ అంటున్నారు. నేను జగన్ని ఒక్కడినే కలవలేదు.. బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలందర్నీ కలిశాను' అని ఆయన అన్నారు.
అసలు జగన్ను కలవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ దగ్గరికి వెళితే ఒక రకమైన అనుమానం, వెళ్లకపోతే మరోరకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తనను కొందరు విమర్శిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆగస్టులో తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే రోడ్డెక్కేందుకు సిద్ధం అని మరోసారి తెలిపారు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఇదే తన చివరి ఉద్యమమని అన్నారు. మరోవైపు తన ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ ముద్రగడ పద్మనాభం శనివారం ఉదయం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ప్రముఖ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలతో పాటు దర్శకతర్న దాసరిని కలిసిన సంగతి తెలిసిందే.