బాబు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు, ఆయన మొండి, నేను జగమొండి: ముద్రగడ
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.2 లక్షల కోట్లకు ఎలా చేరారో చెప్పాలని, అలాగైతే దీక్ష విరమిస్తానని, బాబు మొండి అయితే తాను జగమొండిని అని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ దీక్ష అన్నారు.
ఆయన దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నుంచి ఆయన దీక్ష చేస్తున్నారు. ఆయన వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. ముద్రగడ ఇంటికి జాయింట్ కలెక్టర్ చేరుకొని వైద్య పరీక్షలు చేసుకోమని కోరగా, ఆయన ససేమీరా అంటున్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ తన గది తలుపులను తెరిచారు. మీడియాతో మాట్లాడారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అనారోగ్యం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. తన జీవితం తన జాతికే అంకితమన్నారు.
తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. భయపడి దీక్షను విరమించే ప్రసక్తే లేదన్నారు. జైల్లో పెట్టినా దీక్ష కొనసాగుతుందన్నారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లకు ఎలా చేరుకున్నారో చెబితే దీక్ష విరమించేందుకు సిద్ధమని చప్పారు.
తమ డిమాండ్ల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకతతో ఉన్నారని తెలిసిందన్నారు. తాను పత్రికాముఖంగా మాట్లాడటం ఇదే తొలిసారి అన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదని చెప్పారు. అనారోగ్యే పేరుతో తమను తరలించాలని చూస్తున్నారని, అందుకే వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నామన్నారు. తాము ఆరోగ్యంగా ఉన్నామన్నారు.
చంద్రబాబుతో తోడ, బొడ్డు భేటీ
చంద్రబాబుతో తోట త్రిమూర్తులు, బొడ్డి భాస్కర రావు సమావేశమయ్యారు. ముద్రగడ దీక్ష పైన చర్చిస్తున్నారు. మరోవైపు, జిల్లా జాయింట్ కలెక్టర్... ముద్రగడ ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పినా, నిరాకరిస్తున్నారు. ముద్రగడకు మద్దతుగా తూగో జిల్లాలో సంఘీభావ దీక్షలు కొనసాగుతున్నాయి.