జగన్ ఎఫెక్ట్ వల్లే మలుపు: చిరు, రఘువీరాలతో ముద్రగడ భేటీ
హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తన వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ముద్రను తొలగించుకోవడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
తన ప్రయత్నంలో భాగంగానే ఆయన శనివారంనాడు కాంగ్రెసు నాయకులు రఘువీరా రెడ్డిని, చిరంజీవిని కలిసినట్లు తెలుస్తోంది. కాపు నిధి కన్నా తమకు రిజర్వేషన్లు ముఖ్యమని ముద్రగడ పద్మనాభం చిరంజీవిని కలిసిన తర్వాత చెప్పారు. తనకు మద్దతు తెలిపినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పినట్లు ఆయన తెలిపారు.
కాపు రిజర్వేషన్ల అమలుకు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డెడ్లైన్ పెట్టారు. కాపులను బీసీల్లో చేర్చాలని, లేని పక్షంలో పెద్ద యెత్తున ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆయన రఘువీరా రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
మంజునాథ కమిషన్ మధ్యంతర నివేదికను 9 నెలల్లోగా తెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ సమయం ఆగస్టుతో పూర్తవుతుందని, మాటను నిలబెట్టుకుని నివేదిక తెప్పించి అసెంబ్లీలో దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, కేంద్రానికి పంపించాలని ఆయన అన్నారు.
రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఆ అంశాన్ని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అది ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదని ముద్రగడ అన్నారు. కాపు రిజర్వేషన్లకు కాంగ్రెసు మద్దతు ఇస్తుందని, పార్లమెంటులో అండగా ఉంటుందని రఘువీరా రెడ్డి చెప్పారు.
కాపులకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని, కాపు రిజర్వేషన్లకు సోనియా, రాహుల్ మద్దతు ఉందని ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెసు కాపు రిజర్వేషన్ల సాధన కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సీనియర్ నేత రాజేశ్వర రావు నేతృత్వం వహిస్తారు. ఇచ్చిన హామీ మేరకు కాపు రిజర్వేషన్లను ఆగస్టులోగా అమలు చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
ముద్రగడ పద్మనాభం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణను, కాంగ్రెసు నేత సి. రామచంద్రయ్యను కూడా కలుస్తారు.