అనుమతి తీసుకునేది లేదు: చంద్రబాబుపై తగ్గని ముద్రగడ, నాలుగంచెలుగా..
ఈ నెల 18న నల్ల రిబ్బన్లు, కంచం, గరిటతో ఆందోళన, ఈ నెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు, జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్రతో ముద్రగడ నిరసన తెలపను
విజయవాడ: రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు ఐక్య కార్యాచరణ సమితి నేతలతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం శక్రవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. నాలుగు అంచెల ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 18న నల్ల రిబ్బన్లు, కంచం, గరిటతో ఆందోళన, ఈ నెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. పాదయాత్రకు పోలీసు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
నవంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించాలని భావించారు. అయితే దీనికి ప్రభుత్వం అనుమతించలేదు. అనుమతి తీసుకోలేదని నిరాకరించారు.
కాపులను బీసీలలో చేర్చాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, దీనిని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం పోరు సల్పుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో ఉద్యమ కార్యాచరణ చేపట్టారు.