ట్వీట్లు, సభలతో హోదా రాదు: పవన్, జగన్లను ఉద్దేశించి ముద్రగడ
ప్రత్యేక హోదా సాధనపై కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పరోక్షంగా పవన్ కల్యాణ్, జగన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ట్వీట్లు చేయడం, సభలు పెట్టడంతో ప్రత్యేక హోదా వస్తుందనుకోవడం భ్రమ మాత్రమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చే పార్టీలు, వ్యక్తులతో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒకే గొడుగు కిందకి రావాలని అన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే యువతకి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అన్ని రాజకీయ పార్టీలకు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులకు లేఖలు రాశానని చెప్పారు.
సెలబ్రిటీలకు కూడా తాను లేఖలు రాసినట్లు తెలిపారు. తలుచుకుంటే సాధ్యం కానిది వుండదని, ప్రత్యేక హోదా కూడా అంతేనని, ప్రత్యేక తెలంగాణ, తమిళనాడులో జల్లికట్టు వంటివి ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలని ముద్రగడ అన్నారు.