సీమ సంస్కృతి.. అంటూ జగన్పై మురళీ మోహన్ ఫైర్: 'ముద్రగడతో న్యాయం జరగదు'
రాజమహేంద్రవరం: కొంతమంది నాయకులు స్వలాభం కోసం రాయలసీమ సంస్కృతిని కోనసీమకు తీసుకు వస్తున్నారని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ శుక్రవారం నాడు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాపు గర్జన నేపథ్యంలో జరిగిన తుని విధ్వంసం బాధాకరమన్నారు. సొంత లాభం కోసం కొంతమంది నేతలు సీమ సంస్కృతిని కోనసీమకు తెస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
కాపుల రిజర్వేషన్లను సమర్థించిన బిసి నాయకులు
బీసీ రిజరేవేషన్లను గ్రూపులుగా విభజిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని కాపు-బిసి ఐక్య వేదిక శుక్రవారం పేర్కొంది. ఇటీవల ముద్రగడకు కౌంటర్గా ఎమ్మెల్యే సుగుణమ్మ కాపు - బిసి ఐక్య వేదికను ప్రారంభించారు. వీరు కాపులను బీసీలలో చేర్చడాన్ని స్వాగతిస్తూ, బీసీలకు అన్యాయం జరగవద్దని అంటున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం నాడు కాపు - బీసీ ఐక్య వేదిక నేతలు చిత్తూరు జిల్లా తిరుపతిలో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభంతో దీక్ష విరమింప చేసేందుకు ఐక్య వేదిక నాయకులు ఓ సూచన చేశారు. రెండేళ్లలో సమస్య పరిష్కరిస్తామని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయాలని వారు అన్నారు.
ముద్రగడ దీక్షతో కాపులకు న్యాయం జరగదు: రామానుజయ
ముద్రగడ పద్మనాభం దీక్షతో కాపులకు న్యాయం జరగదని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు.