బాబు ఝలక్: రేసు నుంచి మురళీ మోహన్ ఔట్, రాయపాటి ఏం చేస్తారు?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు గట్టి షాకిచ్చారు. ఇక నుంచి ప్రజాప్రతినిధులకు ఎలాంటి నామినేటెడ్ పదవులు కట్టబెట్టనని ఆయన తేల్చి చెప్పారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు గట్టి షాకిచ్చారు. ఇక నుంచి ప్రజాప్రతినిధులకు ఎలాంటి నామినేటెడ్ పదవులు కట్టబెట్టనని ఆయన తేల్చి చెప్పారు.
టిటిడి చైర్మన్ పదవి కోసం రాయపాటి, ఇక మీకివ్వనని మురళీ మోహన్కు బాబు ఝలక్
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావు వంటి వారికి గట్టి షాక్ తగిలినట్లే. అయితే, టిటిడి చైర్మన్ రేసులో ఇప్పుడు ఎవరు ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు నిర్ణయం
టిటిడి పాలక మండలి ఛైర్మన్ సహా, వివిధ కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థల ఛైర్మన్లు, దేవాలయాల పాలక మండళ్ల ఛైర్మన్లు వంటి నామినేటెడ్ పదవులను ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇవ్వరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
అభిప్రాయం చెప్పేశారు
రెండు రోజుల క్రితం ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, మురళీ మోహన్లు చంద్రబాబును కలిశారు. తమకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో నామినేటెడ్ పోస్టులపై తన అభిప్రాయాన్ని ఆయన చెప్పారని తెలుస్తోంది.
ఆశావహులు ఎక్కువే
టిటిడి ఛైర్మన్ పదవికి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల్లోను కొందరు ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే, ఎంపీలు, ఎమ్మెల్యేలకు దేవాలయాల పాలకమండళ్లు, కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు ఇవ్వరాదని విధాన నిర్ణయంగా పెట్టుకున్నామని, పదవుల కోసం వారు పదే పదే తనను కలుస్తుండటం, పదవులు దక్కనివారి అలకలు వల్ల... తన దైనందిన పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది ఏర్పడుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పారని అంటున్నారు.
రాయపాటి ఏం చేస్తారు?
ఇది పార్టీ పరమైన నిర్ణయమని, విధామనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు అలా చెప్పడంతో మురళీ మోహన్ రేసు నుంచి తప్పుకున్నారు. అయితే రాయపాటి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆ పదవి కోసం అవసరమైతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.