చెప్పి, చెప్పకనే.. ఒప్పేసుకున్న మురళీ మోహన్: అంత 'లైట్' తీసుకున్నారా?
రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. పదవులు కాపాడుకోవడానికే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్న సంగతిని మురళీ మోహన్ పరోక్షంగా ఒప్పుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చడంలో బీజేపీ అడుగులకు టీడీపీ మడుగులు ఒత్తిందన్న అపవాదు ఇప్పటికీ జనంలో ఉంది. టీడీపీ మూడేళ్ల పాలనలో ఇదో పెద్ద వైఫల్యంగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. తమకున్న మీడియా మేనేజ్ మెంట్ తో ఈ విషయాన్ని అంతగా హైలైట్ కాకుండా ఆ పార్టీ చూసుకుంది.
అదే
సమయంలో
నిన్న
మొన్నటిదాకా
హోదాపై
గొంతెత్తిన
ప్రతిపక్షం
సైతం..
బీజేపీకి
దగ్గరవుతున్న
సంకేతాలిస్తూ
హోదాపై
మాట్లాడటం
మానేసింది.
దీంతో
ఏపీలోని
రెండు
ప్రధాన
పార్టీలు
హోదాను
పక్కనపెట్టేశాయన్న
సంగతి
స్పష్టంగా
అర్థమవుతోంది.
హోదా కోసం ఎందుకు గట్టిగా పోరాడాలేకపోయారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. నేతలే నీళ్లు నమిలే పరిస్థితి. తాజాగా టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ సైతం ఇదే పనిచేశారు. టీడీపీ మూడేళ్ల పాలనలోని వైఫల్యాలపై ఓ టీవి చానెల్ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయన చాలానే తడబడ్డారు. ఎక్కడా సూటిగా సమాధానం చెప్పకుండా ఏదో దాటవేత ధోరణితో పొడి పొడి సమాధానాలు చెప్పుకొచ్చారు.
హోదా విషయంలో బీజేపీపై ఒత్తిడి ఎందుకు తేలేకపోయారు? అన్న ప్రశ్నకు ఎంపీ గారు ఇచ్చిన సమాధానం వారి చిత్తశుద్ది ఏపాటిదో బయటపెట్టింది. కేంద్రంలో బీజేపీ చాలా బలంగా ఉందని, ఒకవేళ తెగించి మేం రాజీనామాలు చేసినా.. చేసేయండి అనడానికి వాళ్లు రెడీగా ఉన్నారని, అలాంటి స్థితిలో రాజీనామాలు చేయగలమా? అని కప్పి పుచ్చుకునే సమాధానం చెప్పారు.
దీన్నిబట్టి రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. పదవులు కాపాడుకోవడానికే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్న సంగతిని మురళీ మోహన్ పరోక్షంగా ఒప్పుకున్నట్లే. మొత్తం మీద బీజేపీపై ఒత్తిడి తేవడంలో టీడీపీ ఎంత సుతిమెత్తగా వ్యవహరించిందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇదే హోదా అంశం మరోసారి కీలకంగా మారబోతున్న నేపథ్యంలో.. ఏం సమాధానం చెప్పి టీడీపీ జనాన్ని మెప్పిస్తుందో వేచి చూడాలి.