హోదాపై రగడ: రాజీనామాకు రెడీ అని మురళీమోహన్, బాబు డ్రామాలని కెవిపి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరమని, హోదా ఇస్తామంటే ఏ త్యాగానికైనా తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ స్పష్టం చేశారు. కేంద్రంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు.
తాము పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీల్లా వ్యాపారాల కోసం పదవులను అడ్డుపెట్టుకోమని వ్యాఖ్యానించారు. ఉద్యమాలతో హోదా వస్తుందంటే తాము మద్దతిస్తామని మురళీమోహన్ తెలిపారు. ప్రత్యేక హోదాపై ఏం చేయాలనే విషయంపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పార్లమెంట్లో పోరాడతానని స్పష్టం చేశారు.
విభజనకు సై చెప్పిన వారు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసినా చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. వెంటనే కేంద్రం నుంచి చంద్రబాబు బయటకు రావాలని ఎంపీ కేవీపీ డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రం ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై పోరాడాలని ఆయన అన్నారు. ఆ దిశగా వైసీపీ, కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 5వ తేదీన ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లు చర్చ సందర్భంగా కేంద్రంలో ఉండాలా? లేదా? అనేది చంద్రబాబు నిర్ణయించుకోవాలని రామకృష్ణ అన్నారు.