ముస్తఫాపై రేప్ జరగలేదు: ఫోరెన్సిక్ రిపోర్ట్, హత్యేనని..
హైదరాబాద్: మెహిదీపట్నంలో గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో మృతి చెందిన బాలుడు ముస్తఫా అత్యాచారానికి గురి కాలేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడైనట్లు తెలిసింది. ఘటన జరిగిన అనంతరం విచారణ కోసం పోలీసులు 24 రకాల ఆధారాలను పోరెన్సిక్ విభాగానికి పోలీసులు అందజేశారు. వీటన్నంటిపై పరిశీలన జరిపిని ఫోరెన్సిక్ విభాగం బాధిత బాలుడిపై అత్యాచారం జరగలేదని పేర్కొంది.
ఫోరెన్సిక్ నివేదిక హుమాయున్ నగర పోలీసులకు అందినట్లు తెలిసింది. కాగా, ఫోరెన్సిక్ నివేదిక తుది దశకు చేరుకున్న విచారణలో కీలకం కానుంది. ముస్తఫాది హత్యేనని, అతడి ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టారని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. సంఘటన స్థలంలో ఉన్న కిరోసిన్, అతడి ఒంటిమీద పోసిన ఇంధనం ఒకటేనని తేల్చి చెప్పింది. సంఘటన స్థలంలో ఉన్న రక్తపు మరకలు ఎవరివనే విషయంపై తొలుత అనుమానాలు నెలకొన్నప్పటికీ.. ముస్తాఫాను కాపాడే క్రమంలో అతడి సోదరుడి చేతికి గాయాలయ్యాయని, అతడి రక్తమే అక్కడ మరకలుగా ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా పోస్టుమార్టం నివేదిక కూడా ముస్తఫాది హత్యేగానే తేల్చింది. అతనిపై కిరోసిన్ పోసి నిప్పటించినట్లుగా తెలిపింది. అయితే అతనిపై ఎవరు, ఎలా కిరోసిన్ పోసి నిప్పంటించారనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక ఇప్పటికే పోలీసులకు చేరింది.
అక్టోబర్ 8న హైదరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ముస్తఫా అక్టోబర్ 9వ తేదీ ఉదయం మృతి చెందాడు. అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం తర్వాత మెహిదీపట్నంలోని మిలిటరీ క్వార్టర్స్ పరిధిలో ముస్తఫాపై కిరోసిన్ పోసిన వ్యక్తులు అతడి ఒంటికి నిప్పు పెట్టారు. దీంతో 90 శాతం గాయాలైన ముస్తఫాను తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఆ సమయంలో పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు, మిలిటరీ క్వార్టర్స్ ముందు భారీ సంఖ్యలో మోహరించారు. కాగా, మిలిటరీ దుస్తుల్లో ఉన్న వ్యక్తులే తనను తగులబెట్టారని తన వాంగ్మూలంలో ముస్తఫా పేర్కొన్నాడు. అయితే ముస్తఫా ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మిలిటరీ ఓ ప్రకటన చేసింది.
బాలుడుపై కిరోసిన పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మిలటరీ అధికారులు స్ఫష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో మిలటరీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని మిటలరీ అధికారులు తెలిపారు. బాలుడుని మిలటరీ అధికారులు కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. సిట్ విచారణ పూర్తయితే గానీ అసలు నిజం తెలిసే అవకాశం ఉంది.