అమెరికాలో పవనిజాన్ని వ్యాప్తి చేస్తానన్నాడు, అందుకే చంపేశారు: వినోద్ తల్లి వేదవతి
తిరుపతి: పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తన బిడ్డకు పిచ్చి అభిమానమని, మరణంలో పవనిజాన్ని చూపించిన తన కుమారుడు స్వర్గంలో కూడా పవనిజాన్ని చూపిస్తాడని వినోద్ తల్లి వేదవతి అన్నారు. తన బిడ్డే కాకుండా తాను కూడా చిన్నప్పటి నుంచే మెగాస్టార్ అభిమానినని, ఆ కుటుంబం మాటలు నమ్మి సేవ చేస్తున్నందుకే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె ప్రముిఖ తెలుగు టీవీ చానెల్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. 'మావాడు చిన్నప్పటి నుంచే పవన్ ఫ్యాన్. పవన్ లాగానే గడ్డం పెంచడం, కేన్సర్ రోగులకు సహాయం చేయడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పుస్తకాల నిండా.. పవన్ నినాదాలే ఉండేవి. అమెరికా వెళ్లి పవనిజాన్ని వ్యాప్తి చేస్తానన్నాడు. అదినచ్చకే.. వాళ్లు నా బిడ్డను చంపేశారు' ఆమె అన్నారు.
తన బిడ్డ ఆశయాలను నెరవేర్చేందుకు పవన్తో కలిసి నడుస్తానని, తనకు న్యాయం చేయడానికి పవన్ ఎంత దూరం అయినా వెళ్తారని, తనకు చిన్నప్పటి నుంచి తెలుసు మాట ఇస్తే ప్రాణం అడ్డం పెట్టే మనిషి పవన్ కల్యాణ్ అని ఆమె చెప్పారు. తాము చిన్నప్పటి నుంచి మెగాఫ్యామిలీ అభిమానులమని, వాళ్లు ఎగుడుదిగుడు మనుషులు కాదని, కష్టపడి పైకొచ్చినవాళ్లమని చెప్పారు.
తాను వాళ్లను దేవుడ్ని నమ్మినట్లు నమ్ముతానని, తన బిడ్డ పవన్ తన దేవుడు అంటాడని ఆమె చెప్పారు. అటువంటి తన బిడ్డ మాటను నేను వినాలి కదా? నమ్మాలి కదా? అన్నారు. తన బిడ్డ మాట విని తాను కూడా కళ్లు దానం చేశానని, తమ వాడు అమెరికా వెళ్లి పవనిజాన్ని వ్యాప్తి చేస్తానన్నాడని చెప్పారు. తాము ఎటువంటి అడ్డు చెప్పలేదని, తమ వాడు ఇప్పుడు స్వర్గంలో కూడా పవనిజాన్ని చూపిస్తాడని అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాకతో.. తన కుమారుడి ఆత్మకు 99శాతం శాంతి చేకూరిందని, హంతకులకు శిక్ష పడితే వందశాతం శాంతి చేకూరుతుందని అన్నారు. ఇటీవల ఎన్టీఆర్ అభిమాని చేతిలో పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ కర్నాటకలోని కోయల్ ప్రాంతంలో హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్న వినోద్ తల్లిదండ్రులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. పవన్ పరామర్శ తరువాత వినోద్ తల్లి వేదవతి మీడియాతో మాట్లాడారు.