సిఐ భార్య అనుమానాన్సపద మృతి: కోట్ల అనుచరుడి హత్య
హైదరాబాద్: అనంతపురం జిల్లా రూరల్ సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ భార్య పద్మ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్జున్ నాయకే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పద్మ పిల్లలు కూడా తండ్రి మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తన భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని సీఐ అర్జున్ నాయక్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పద్మ మృతి మిస్టరీగా మారింది. త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.
సిఐ భార్య పద్మ మృతిపై మరో కథనం వినిపిస్తోంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఆరవవాండ్లలో పొలం వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్నవారిపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ మహిళ మరణించింది. భర్త అర్జున్ నాయక్ గాయపడ్డాడని, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలావుండగా, కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం మళ్లీ పడగ విప్పింది. కొత్తబురుజులో టీడీపీ, కాంగ్రెస్ల మధ్య జరిగిన ఫ్యాక్షన్ దాడుల్లో శాంతిరాజ్ అనే వ్యక్తి మరణించాడు. శాంతిరాజ్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నాడు. అతను మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి అనుచరుడు.
వివాహిత ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం దోస్త్నగర్ గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శనిగరపు నాగేందర్, ప్రసన్నలకు ఏడాది కింద వివాహమైంది. కటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ప్రసన్న మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తీవ్రంగా గాయపడిన ప్రసన్నను వెంటనే కడెం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.