వారం క్రితం పెళ్లి: టెక్కీ భార్య అనుమానాస్పద మృతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడలో ఓ నవ వధువు అపార్టుమెంట్ పై నుండి కిందపడి మృతి చెందింది. ఆమె మృతి పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన ఆమె పేరు సౌజన్య. అయోధ్య నగర్లోని ఓ అపార్టుమెంట్ పై నుండి పడి మృతి చెందారు.
ఆమె ఎండదెబ్బకు స్పృహతప్పి పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, సీసీటీవీ ఫుటేజీలో ఆమె పడిన తీరు అనుమానాస్పదంగా ఉందని తెలుస్తోంది.
సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దానిని పరిశీలించిన అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె రెండు రోజుల క్రితం అపార్టుమెంటు నుండి కిందపడి మృతి చెందారు.
సౌజన్యకు ఇటీవలె పెళ్లి జరిగినంది. ఈ నెల 20వ తేదీన కృష్ణలంకకు చెందిన దిలీప్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన వారం రోజుల్లోనే ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
తొలుత వడదెబ్బగా భావించినప్పటికీ.. సౌజన్య శరీరంపై గాయాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ను పోలీసులు విచారిస్తున్నారు. దిలీప్ సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. సౌజన్య ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, సౌజన్య(28)కు వారం రోజుల క్రితం ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో.. అపార్టుమెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అంటున్నారు.