ఏపీకి తీపి కబురు, నేరుగా కేంద్రానికే: చంద్రబాబు ఖర్చు చేసింది వెనక్కి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు తీపి కబురు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనధార అని తెలిసిందే. దీనికి పూర్తిస్థాయి నిధులు అందించేందుకు నాబార్డ్ ముందుకు వచ్చింది. ఈ మేరకు నాబార్డ్, పోలవరం జాతీయ అథారిటీకి మధ్య సోమవారం నాడు ఒప్పందం కుదిరింది.
ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఇక నాబార్డే భరిస్తుంది. ఎఫ్ఆర్బీఎం లాంటి పరిమితులు లేకుండా పూర్తి స్థాయిలో నాబార్డ్ బాధ్యత తీసుకుంటోంది. అక్టోబర్ 15న పోలవరానికి తొలివిడత రుణం అందించనుంది. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో పోలవరం అత్యంత కీలకం.
ప్రాజెక్టు పూర్తి అయితే కొత్తగా 13 లక్షల ఎకరాలకు నీరుతోపాటు అటు విశాఖ నుంచి ఇటు దిగువన ఏడు జిల్లాల వరకు ప్రభావం చూపనుంది. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో నాబార్డ్ భరోసా సంజీవనిలా అందిందని, ఇక నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ వంద శాతం తొలగిపోయినట్లేనని అంటున్నారు. ఏపీకి ప్యాకేజీ ఎంత ప్రయోజనమో.. నాబార్డ్ భరోసా అంతే ప్రయోజనమంటున్నారు.
నాబార్డ్ నేరుగా కేంద్రానికే నిధులు ఇస్తుందని, రుణాన్ని తిరిగి కేంద్రమే చెల్లిస్తుందని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రమే రుణం తీసుకుంటున్నందున ఎఫ్ఆర్బీఎంకి సంబంధంలేదన్నారు.
మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి నాబార్డ్ వద్ద నిధులు ఉన్నాయని సుజన చెప్పారు. ఇప్పటి వరకు ఖర్చు చేసిన తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టు వ్యయం 2014 గణాంకాల ప్రకారం లెక్కగట్టారని, ఆ ప్రకారం నిర్మాణ ఖర్చు రూ.16వేల కోట్లు అన్నారు.