ఈజీగా వదలడు, చిరంజీవికి-జనసేనకు సంబంధం లేదు: పవన్పై నాగబాబు
మెగా సోదరుడు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో తెలిపారు.
హైదరాబాద్: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు పైన ప్రశంసలు కురిపించిన మెగా సోదరుడు నాగబాబు తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో తెలిపారు.
పవన్ కళ్యాణ్, జగన్ నుంచి చంద్రబాబు వరకు ఎవర్నీ వదలని నాగబాబు!?
సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ రూ.కోట్లు సంపాదిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారన్న ప్రశ్నకు అతని సోదరుడు నాగబాబు జవాబిచ్చాహరు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు.
గొప్ప భావజలం, మంచి మనసు, మానవత్వం పవన్ సొంతమని చెప్పారు. సాధారణంగా ఏం చేయలేమనే నిరాశతో అనేక అంశాలను మనం వదిలేస్తుంటామని, కానీ పవన్ మాత్రం అలా కాదన్నారు. దేనిని కూడా అంత సాధారణంగా పవన్ వదిలేయడని చెప్పారు.
అభిమానులు కోరినందునో లేక అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లనో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించలేదని చెప్పారు. ప్రజలకు అండగా ఉండాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. నిరాశతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు.
పవన్ ఆర్థికి స్థితి పైన కూడా నాగబాబు మాట్లాడారు. పవన్ ఇంతకు ముందు చెప్పినట్టే అతని ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదన్నారు. తన వల్ల కూడా తమ్ముడు కొంచెం డబ్బు నష్టపోయాడని చెప్పారు. అయితే, డబ్బుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వడని చెప్పారు. ఆర్థిక సమస్యలను లెక్క చేయడన్నారు. మరో నాలుగైదు సినిమాలు చేస్తే ఆర్థికంగా సెటిల్ అవుతాడని, అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడన్నారు.