15 రోజుల్లో పెళ్ళి అనుమానాస్పదస్థితిలో వరుడు మృతి
మరో పదిహేను రోజుల్లో వివాహం. పెళ్ళికి సంబంధించిన ఆహ్వన పత్రికలను పంచేందుకు వెళ్ళిన పెళ్ళికొడుకు రైల్వే ట్రాక్ పై శవంగా మారాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది..
గుంతకల్లు: మరో పదిహేను రోజుల్లో వివాహం. పెళ్ళికి సంబంధించిన ఆహ్వన పత్రికలను పంచేందుకు వెళ్ళిన పెళ్ళికొడుకు రైల్వే ట్రాక్ పై శవంగా మారాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది..
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరుణ, నాగయ్య దంపతుల రెండో కుమారుడు నాగార్జున అలియాస్ ఇజ్రాయిల్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
నాగార్జునకు ఈ మధ్యనే హావళిగి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 3, 4 తేదిల్లో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురంలో పెళ్ళి జరగాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి పని నిమిత్తం తిరుపతికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుండి వెళ్ళిన నాగార్జున బుదవారం ఉదయం గుంతకల్లు సమీపంలో రైల్వే ట్రాక్ పై మృతదేహమై పడి ఉన్నాడు.
రైలు కింద పడి మరణించడంతో కుటుంబసభ్యులు గుండలవిసేలా రోధిస్తున్నారు. నాగార్జున ప్రమాదవశాత్తు మరణించాడా లేక ఆత్మహత్య చేసుకొన్నాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్ పీ పోలీసులు చెప్పారు.