డిజిటల్ దిశగా చంద్రబాబు: ‘ఏపీ పర్సు’ యాప్ ఉపయోగాలివే!
అమరావతి: డిజిటల్ లావాదేవీల దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో బ్యాంకర్లు, ఆర్బిఐ ఉన్నతాధికారులతో సిఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపీ పర్సు అనే యాప్ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా తొలి లావాదేవీని మార్పు-మీ నేస్తం విధానంలో ఆయన చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ ప్రజలను డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, వాళ్లను నగదు రహిత లావాదేవీలవైపు మళ్లించేందుకు 'మార్పు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించాం' అని చెప్పారు. మొబైల్, కార్డుల లావాదేవీలు పెరగాలన్నారు. నగదు రహిత లావాదేవీలు మరింత సులభంగా చేసుకోవడానికి వీలుగా ఎపి పర్స్ యాప్ సిద్ధం చేశామన్నారు. 10 వాలెట్ కంపెనీలు, 13 బ్యాంక్లు ఈ యాప్లో సభ్యులని తెలిపారు. ఆ సంస్థల్లో ఒకటి ఎంచుకున లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు.
యాప్ వినియోగంపై క్యాష్ బ్యాక్ సౌకర్యం ఉందని, రిజిస్టర్ చేసుకున్నప్పుడు 60 రూపాయలు వాలెట్గా ఇస్తారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వానికి ఆదాయం తగ్గి, కొంత నష్టం వచ్చినా.. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసేందుకు కర్తవ్యంగా భావించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా 70 శాతంమందికి సరకు పంపిణీ చేశామన్నారు. నగదు చెల్లంపులకు ఒత్తిడి తేవడం లేదన్నారు.
ఎపీ పర్సు, మార్పు-మీ నేస్తం ద్వారా కొత్త అధ్యాయానికి నాంది పలికామన్నారు. ఇప్పటికే 1000 మంది ఉపయోగించుకుంటున్నారని, ప్రతి ఒక్కరినీ డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకే ఈ ప్రయత్నాలని వివరించారు. ప్రస్తుతం 2040 కోట్ల రూపాయల నగదు అందుబాటులో ఉందని, వీటిలో చిన్న నోట్లు 211 కోట్ల రూపాయలన్నారు. డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటైన జాతీయ కమిటీ సమావేశం డిసెంబర్ 8న ముంబైలో జరుగుతుందని చెప్పారు. ఈ కమిటీ సమావేశంలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
డిజిటల్ లావాదేవీలు: ఏపీ పర్సు గురించి..
- వాడుకలో ఉన్న ఈ-వాలెట్ చెల్లింపుల యాప్స్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ను ఒక వేదిక మీదకు తీసుకురావటం.
-సామాన్యులకు కూడా సులువుగా అర్ధమయ్యేలా తెలుగులోనూ... ఎలా వాడాలి అన్న అంశాల్ని పొందుపరచటం.
- ఫైబర్నెట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరపున దీనిని రూపొందించింది.
-ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వాడేవారు గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
-సులువుగా పేరు, మొబైల్ నెంబరుతో రిజిష్టర్ చేసుకోవచ్చు. అంతేగాక, దీనిని ఓపెన్ చేయగానే చెల్లింపులు చేయగలిగే పేమెంట్ యాప్స్... మొబిక్విక్, పాకెట్స్, జియోమనీ, స్పీడ్ పే, చిల్లర్, స్టేట్ బ్యాంక్ బడ్డీ, టీఏ వాలెట్, ఫ్రీఛార్జ్, పేటీఎం, వొడాఫోన్ ఎం-పేస, ఎయిర్టెల్ మనీ, హెడ్డీఎఫ్సీ పేజాప్ తదితరాలు వస్తాయి. వీటిని ఇక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవటం ద్వారా వాడుకోవచ్చు.
-మొబైల్బ్యాంకింగ్ విభాగంలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ తదితర బ్యాంకుల యాప్స్ వస్తాయి. ఆయా బ్యాంకుల ఖాతాదారులు వీటిని ఇక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకోవటం ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.