అమ్మాయిపై అఘాయిత్యం: మాట్లాడుతూ కంటతడి పెట్టిన నన్నపనేని
సామూహిక అత్యాచార బాధితురాలి గురించి మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారి కంట తడి పెట్టారు. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు..
గుంటూరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందనలో బాలిక (14) కిడ్నాప్, సామూహిక లైంగికదాడి కేసులో నిందితుల తరఫున వాదించవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ దారుణం చిన్న విషయం కాదని ఆమె అన్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఆమె వేదనను తట్టుకోలేక కంటతడి పెట్టారు.
పొలంలో పనిచేసే మహిళలకు, ఆసుపత్రులలో పనిచేసే మహిళలకు, ఉద్యోగస్థులైన మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రాజకుమారి అన్నారు. గురువారం సత్తెనపల్లి మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులు లైంగికదాడికి పాల్పడడమే కాకుండా చంపేందుకు కూడా ప్రయత్నించారని బాధితురాలు తనతో చెప్పిందని అన్నారు.
పోలీసులు ఇప్పటికే నిందితులపై అన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని, నిందితులను ఎవరూ సమర్థించకూడదని, ఈ దారుణాన్ని సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళానని అన్నారు. మహిళా కమిషన్ తరపున బాలికకు న్యాయం చేస్తామని, ఆమెను మేం చదివిస్తామని రాజకుమారి తెలిపారు. సకాలంలో స్పందించి నిందితులను అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చిన సత్తెనపల్లిరూరల్ సీఐ కోటేశ్వరరావును, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు.
నిందితులకు ఉరిశిక్షలు పడేలా చూడాలని, రాష్ట్ర వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు రాజకుమారిని కోరారు. ఆమెతో పాటు మహిళా కమీషన్ కార్యాలయ ఎస్ఓ సంధ్యారాణి కూడా ఉన్నారు. ముందుగా రాజకుమారి బాలికను పరామర్శించి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు.