మీరే తల్లిదండ్రులు, పెళ్ళికూతురుగా తీర్చిదిద్దుతా, శిల్పాపై అఖిలప్రియ పరోక్ష వ్యాఖ్యలు
నంద్యాలను కొత్త పెళ్ళి కూతురులా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతికశాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. నియోజకవర్గస్థాయి నవనిర్మాణ దీక్షలో సభలో ఆమె పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ
నంద్యాల: నంద్యాలను కొత్త పెళ్ళి కూతురులా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతికశాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. నియోజకవర్గస్థాయి నవనిర్మాణ దీక్షలో సభలో ఆమె పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ నియోజకవర్గం అభివృద్ది జరగలేదని ఆమె పరోక్షంగా శిల్పాపై వ్యాఖ్యలు చేశారు.
నంద్యాలలో జరిగిన నియోజకవర్గస్థాయి నవనిర్మాణ దీక్షలో జిల్లా ఇన్ చార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులుతోపాటు కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో ఈ స్థానం నుండి శిల్పా మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడ పనిచేశారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ తరుణంలో నంద్యాల కేంద్రంగా చేసుకొని భూమా అఖిలప్రియ పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అయితే నవనిర్మాణ దీక్ష సభలో కూడ ఆమె భూమా దంపతులను గుర్తుచేసుకొన్నారు. జిల్లా అభివృద్దికోసం భూమా దంపతులు ఏ రకంగా వ్యవహరించారనే విషయాన్ని ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు.
జిల్లా అభివృద్దితోపాటు నియోజకవర్గాన్ని కూడ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళేందుకు కృషిచేయనున్నట్టు మంత్రి చెప్పారు.
పెళ్ళికూతురురిలా తీర్చిదిద్దుతా
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొత్త పెళ్ళి కూతురిలో ముస్తాబు చేస్తానని మంత్రి అఖిలప్రియ ప్రకటించారు.తన తల్లిదండ్రులను తలుచుకొంటూ అఖిలప్రియ చేసిన ప్రసంగం స్థానికులను ఉద్వేగానికి గురిచేసింది. మంత్రి అఖిలప్రియ కూడ బావోద్వేగానికి లోనయ్యారు. వారిని పదేపదే తలుచుకొన్నారు. భూమా దంపతుల పేర్లను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగించిన సమయంలో ఈలలు, చప్పట్లు, కేకలతో స్థానికులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.నంద్యాలను పెళ్ళికూతురులా తీర్చిదిద్దుతానని ఆమె ప్రకటించారు.
కాంగ్రెస్ హయంలో నంద్యాలలో అభివృద్ది జరగలేదు
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నంద్యాలలో అభివృద్ది జరగలేదని ఆమె విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభివృద్ది గురించి పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ప్రజల కోసం పార్టీ మారి ముఖ్యమంత్రి అండదండలతో కోట్లాదిరూపాయాలను అభివృద్ది పనులకు ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు.పేదలకు 13 వేల ఇళ్ళ నిర్మాణాన్ని, నియోజకవర్గంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు మంజూరు చేయించి వారందరినీ కూర్చోబెట్టి బోజనాలు పెట్టి తన తండ్రి భూమానాగిరెడ్డి చూపిన బాటలోనే తాను నడుస్తానని చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా శిల్పామోహన్ రె్డ్డి ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ హయంలో అభివృద్ది జరగలేదంటూ ఆమె చేసిన విమర్శలు ఆసక్తిని కల్గిస్తున్నాయి.
రెండు నియోజకవర్గాల ప్రజలే తల్లిదండ్రులు
నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల ప్రజలే భూమా కుటుంబానికి తల్లిదండ్రులన్నారు అఖిలప్రియ.రెండు నియోజకవర్గాల అభివృద్ది కోసం ప్రణాళికబద్దంగా కృషిచేస్తానని చెప్పారు. భూమా నాగిరెడ్డి మరణించిననాటి నుండి ఇచ్చిన హమీలను నెరవేరుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమన్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, పచ్చళ్ళ తయారీతో నంద్యాల మహిళలు జీవనం సాగిస్తున్నారని, వీరికి ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె కలెక్టర్ ను ఆదేశించారు.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు త్వరలో జరిగే అవకాశాలున్నాయి.ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే తన తండ్రి ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకుగాను అఖిలప్రియ వేగంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఎక్కువ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు.