నంద్యాలపై మెట్టు దిగిన బాబు: అఖిలప్రియతో జగన్ కొత్త వ్యూహం, తెరపైకి 'భూమా'
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి వ్యవహారంలో అంతా రివర్స్ అవుతోందా? రెండు రోజుల క్రితం తనను కలిసిన శిల్పా మోహన్ రెడ్డి వాదనతో చంద్రబాబు ఏకీభవించారా? అఖిలప్రియను బుజ్జగించారా? తెరపైకి శిల్పా పేరు రానుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం శిల్పా సోదరులు సీఎం చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును శిల్పా మోహన్ రెడ్డి కన్విన్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు వద్ద శిల్పా ఆవేదన.. చంద్రబాబు మెట్టు దిగారా
2014లో తాను భూమా నాగిరెడ్డిపై పోటీ చేశానని, కాబట్టి ఇప్పుడు టిడిపి నుంచి తనకే టిక్కెట్ ఇవ్వాలని శిల్పా... చంద్రబాబుకు చెప్పారు. అంతేకాదు, తాను ఇప్పుడు పోటీ చేయకుంటే తన క్యాడర్ దెబ్బతింటుందని చెప్పారు.
అలాగే ఇప్పుడు భూమా కుటుంబానికి అవకాశం ఇస్తే, తన రాజకీయ జీవితం దెబ్బ తింటుందని కూడా చెప్పారని తెలుస్తోంది. ఇలాంటప్పుడు తనకు పార్టీని వీడి మరో పార్టీ నుంచి పోటీ చేయడం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం మాత్రమే మిగిలి ఉందని చెప్పారని తెలుస్తోంది.
సీనియర్ నేతల వాదన కూడా..
పలువురు సీనియర్ నేతలు కూడా ఇదే వాదనను చంద్రబాబు ముందు ఉంచారని తెలుస్తోంది. నంద్యాలలో శిల్పా వర్గానికి మంచి పట్టు ఉందని, రాజకీయంగా చక్రం తిప్పగలరని, భూమా కుటుంబం నుంచి ఎవరికైనా టిక్కెట్ ఇస్తే రాజకీయంగా చక్రం తిప్పలేకపోవచ్చుననే అభిప్రాయాలు పలువురు వెలిబుచ్చినట్లుగా తెలుస్తోంది.
భూమా ఫ్యామిలీ కొత్త.. రాజకీయంగా..
భూమా నాగిరెడ్డికి రాజకీయ చతురత ఉంది. కేవలం ఇప్పుడిప్పుడే రాజకీయ అడుగులు వేస్తున్న అఖిలప్రియకు మరొకరు కొత్త తోడు అయితే ఇటు అళ్లగడ్డ, అటు నంద్యాలకు ఆమెకు ఇబ్బంది అవుతుందని, అది టిడిపికి నష్టమని కూడా కొందరు భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. భూమా కుటుంబానికి ఇచ్చే ముందు అన్నీ ఆలోచించాలని చెప్పారట.
అఖిలప్రియ మెత్తబడ్డారా?
నంద్యాల సీటు తమదే అని, తమ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని ఇటీవల మంత్రి అఖిలప్రియ చెప్పారు. అయితే, ఆ తర్వాత టిడిపి పెద్దలు ఆమెను కన్విన్స్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. నంద్యాల సీటుపై ఆమె మెత్తబడి ఉంటారని చెబుతున్నారు.
జగన్ పార్టీ మైండ్ గేమ్.. సరికొత్త వ్యూహం
నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని జగన్ ఎప్పుడో చెప్పారు. అయితే, పోటీ చేసే అభ్యర్థిపై వైసిపి కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. భూమా కుటుంబంలోని ఒకరికి టిక్కెట్ ఇస్తే.. శిల్పా మోహన్ రెడ్డిని తమ పార్టీలో చేర్పించుకొని, టిక్కెట్ ఇద్దామని జగన్ భావించారు.
పరిణామాలను వైసిపి పరిశీలిస్తోంది
ఈ నేపథ్యంలో టిడిపిలోని పరిణామాలను వైసిపి పరిశీలిస్తోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబుతో శిల్పా భేటీ కావడం, ఆ తర్వాత చంద్రబాబు కన్విన్స్ అయినట్లుగా టిడిపిలో చర్చ జరగడంతో వైసిపి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో ఆయన కుటుంబం నుంచి ఎవరైనా తమ పార్టీ టిక్కెట్పై పోటీ చేసేందుకు ముందుకు వస్తే టిక్కెట్ ఇస్తామని చెప్పారు.