నంద్యాలలో బాబు-జగన్, జనాలు ఉక్కిరిబిక్కిరి: సమస్యాత్మకం.. పోలింగ్పై నిఘా ఇలా
ఉప ఎన్నికల ప్రచారానికి గడువు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఓటర్లను చుట్టు ముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారానికి గడువు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఓటర్లను చుట్టు ముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
శిల్పా మోహన్ రెడ్డిపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు
నంద్యాలలో ఎటు చూసినా పార్టీల జెండాలు, నినాదాలు, ప్రచార హోరు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్లతో పాటు ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి ప్రచారం నిర్వహిస్తున్నారు.
రోడ్డెక్కిన చంద్రబాబు, జగన్- జనాల భయం
శనివారం చంద్రబాబు, జగన్లు నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. దీంతో వీధులు జనాలతో కిటకిటలాడాయి. అనుచరులు, కార్యకర్తలు రోడ్లపైకి, వీధుల్లోకి రావడంతో జనాలు వాహనాల్లో రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు
గత రెండు రోజులుగా పట్టణంలో ఎటు చూసినా ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు శనివారం చంద్రబాబు, జగన్, కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి పర్యటనలు ఉండటంతో ఓటరు వీధుల్లోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. గ్రామాల్లోనూ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ప్రచారంలోకి దిగడంతో ప్రశాంతంగా ఉన్న పల్లెలన్నీ రాజకీయ రంగు పులుముకుంది.
నేతల క్యూ
ఇప్పటికే 10 మంది మాజీ కేంద్ర మంత్రులు, 10 మంది మంత్రులు, 25 మంది మాజీ మంత్రులు, 60 మందికిపైగా ఎమ్మెల్యేలు, మరో 30 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇక లెక్కకుమించి వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మాజీ ఛైర్మన్లు నంద్యాలలో విడిది చేశారు.
నంద్యాలలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు
నంద్యాల నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో నంద్యాల పట్టణంలో 159, నంద్యాల మండలంలో 57, గోస్పాడు మండలంలో 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మూడు రోజుల క్రితం వరకు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 103, సమస్యాత్మక కేంద్రాలుగా 58, సాధారణ కేంద్రాలుగా 77ను చేర్చారు.
సమస్యాత్మక కేంద్రాలు
కానీ, నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల గుర్తింపును మరోసారి అధికారులు పర్యవేక్షించారు. చివరకు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా 141, సమస్యాత్మకంగా 74, సాధారణ కేంద్రాలుగా 40 కేంద్రాలను చేర్చింది. ప్రస్తుత లెక్కన 215 పోలింగ్ కేంద్రాలు ఏదో ఒక విభాగంలో ఉన్నాయి. ఈ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సి ఉందని గుర్తించిన ఈసీ తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో అధిక సంఖ్యలో అధికారులను నియమించడంతోపాటు భారీ పోలీసు బంధోబస్తు, టెక్నాలజీ సాయం పొందేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
13 నుంచి పెరిగాయి
2014 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 13 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే కేంద్రాలుగా 8 కేంద్రాలను గుర్తించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించారు. కానీ మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో కేంద్రాలను విభాగాల వారీగా విడదీసి వివిధ స్థాయి కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు అత్యంత సమస్యాత్మక కేంద్రాలను 141గా గుర్తించారు.
అందుకే పెరిగాయి
ఉప ఎన్నికల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల సంఖ్య పెరగడానికి కారణం ఆయా కేంద్రాల గత చరిత్రే. గతంలో జరిగిన ఎన్నికలను ఆ కేంద్రాల పరిధిలో జరిగిన సంఘటనలు, వార్డులు, గ్రామాల చరిత్రను తీసుకుని వాటిని గుర్తించారు. గత కొన్నేళ్లుగా అక్కడి నెలకొన్న ఘర్షణలు, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో వీటిని వివిధ విభాగాల్లో చేర్చారు. అంతటా పోలీసుల ప్రత్యేక నిఘా పెడుతున్నారు. నంద్యాలకు ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు పక్క జిల్లా పోలీసు యంత్రాంగం చేరుకుంది.