వీరే కీలకం.. ఎవరు ఎటువైపు: అప్పుడు శిల్పా సర్వే చేయిస్తే.., అఖిల కలిసి నడిచేనా?
నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నాయి. టిడిపి, వైసిపిలకు ఉన్న ఓటు బ్యాంకతో పాటు భూమా కుటుంబానికి, శిల్పా కుటుంబానికి ఉన్న ఆదరణ, కేడర్ ఆయా పార్టీలకు ప్లస్.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నాయి. టిడిపి, వైసిపిలకు ఉన్న ఓటు బ్యాంకతో పాటు భూమా కుటుంబానికి, శిల్పా కుటుంబానికి ఉన్న ఆదరణ, కేడర్ ఆయా పార్టీలకు ప్లస్.
వీటికి మరెన్నో చిక్కుముడులు కూడా ఉన్నాయి. వైసిపి నేత కాటసాని రామిరెడ్డి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి బంధువు. అలాగే, శిల్పా మోహన్ రెడ్డి టిడిపి నుంచి వెళ్లడంతో ఆ పార్టీ కేడర్ కొంత ఆయనకు మద్దతిచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం.
ఇలా ఎన్నో చిక్కులు ఉన్నాయి. ప్రధానంగా ఆరుగురు నేతలపై నంద్యాల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. బ్రహ్మానంద రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలకు సీనియర్ నేతల మద్దతు సస్పెన్స్గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అలాగే, తమ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారా లేక బంధుత్వాన్ని చూసుకుంటారా అనే చర్చ సాగుతోంది. ఇవి నంద్యాల ఉప ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.
సీనియర్ వర్సె జూనియర్
శిల్పా మోహన్ రెడ్డి రాజకీయాల్లో చాలా సీనియర్. మరోవైపు అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డిలు ఇప్పుడే రాజకీయాల్లో అడుగు పెట్టారు. శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల ఉపఎన్నిక తన రాజకీయ జీవితంలో ఓ పరీక్షగా చెబుతున్నారు. ఉపఎన్నిక టికెట్ను సొంతం చేసుకొని ఇంట గెలిచినప్పటికీ రచ్చ గెలవాల్సి ఉంది.
సర్వే చేయించుకున్న శిల్పా
అందుకు అందివచ్చిన అవకాశాలన్నింటినీ శిల్పా మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్నారు. టిడిపిని వీడకముందు శిల్పా ఓ సర్వే చేయించుకున్నారట. ఉప ఎన్నికలో వైసిపి తరఫున నిలబడితే ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నదే సర్వే ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. టిడిపిలో టిక్కెట్ వచ్చే అవకాశాలు లేకపోవడం, పైగా సర్వేలో పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఆయన ఆ పార్టీలో చేరారని అంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Recommended Video
శిల్పాపై వారి అసంతృప్తి?
కొంతకాలంగా నంద్యాల రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న గౌరు వెంకట రెడ్డి, గంగుల ప్రతాప రెడ్డి, కాటసాని రామిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు శిల్పాకు మద్దతుగా నిలవాల్సి ఉందంటున్నారు. అయితే, వారిని పక్కన పెట్టి శిల్పా ఒంటరిగా ముందుకు వెళ్తున్నారని, ఇది వారికి రుచించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
కాటసానికి జగన్ ఆదేశాలు
శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారశైలితో వైసిపి నేత కాటసాని రామిరెడ్డి విసిగిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన మౌనంగా ఉంటూ తన అల్లుడు, టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమనే వారు లేకపోలేదు. అయితే, శిల్పాకు మద్దతివ్వాలని జగన్ ఆయనను ఆదేశించారని, దీంతో ఆయన ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వారు సిద్ధంగా ఉన్నారా?
గంగుల వర్గం సైలెంట్గా ఉందని, గౌరు వర్గం చేతులు కలిపేందుకు డైలమాలో ఉందనే ప్రచారం సాగుతోంది. అసలు పార్టీలోకి శిల్పా రావడం పలువురు నేతలకు ఇష్టం లేదని కూడా అంటున్నారు. ఇక, నిన్నటి వరకు ఇంచార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తనకు రావాల్సిన టిక్కెట్ శిల్పాకు పోయినప్పటికీ.. జగన్ సర్ది చెప్పడంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. లోలోపల మాత్రం ఆయనకు అసంతృప్తి ఉందంటున్నారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, గౌరు వెంకట రెడ్డిల మద్దతు శిల్పాకు అవసరమంటున్నారు. అయితే, వర్గ పోరు లేదని వైసిపి నేతలు మాత్రం ప్రకటిస్తున్నారు. విభేదాలు అన్నీ వట్టి మాటలే అంటున్నారు. కలిసి పని చేస్తామని చెబుతున్నారు.
శిల్పా సోదరులు ఇలా..
ఇక, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి తన సోదరుడు, వైసిపి అభ్యర్థి మోహన్ రెడ్డికి మౌనంగా మద్దతు పలుకుతారా, లేక బ్రహ్మానంద రెడ్డి గెలుపు కోసం పని చేస్తారా అనేది సస్పెన్సే అంటున్నారు. చక్రపాణి రెడ్డితో అఖిలప్రియ కలిసి ముందుకు సాగుతారా అనే చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు భూమా కుటుంబానికి దూరం పాటించిన ఏవీ సుబ్బారెడ్డి మద్దతు కూడా బ్రహ్మానంద రెడ్డికి అవసరమే అంటున్నారు. మొత్తానికి ఈ ఆరుగురి పాత్ర నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలా ఉంటుందోననే చర్చ సాగుతోంది.