బాధపడ్డ బాబు: కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నన్నపనేని
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్షమాపణలు చెప్పాలని ఏపీ టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం డిమాండ్ చేశారు.
తెలంగాణ నుండి చంద్రబాబును వెళ్లిపొమ్మనే హక్కు కేసీఆర్కు ఏమాత్రం లేదన్నారు. చంద్రబాబు జాతీయస్థాయి నాయకుడు అన్నారు. ఏ ప్రాంతంలో అయినా సభను నిర్వహించికునే హక్కు, పర్యటించే హక్కు ఆయనకు ఉన్నాయన్నారు.
కాగా, కిరికిరి నాయుడు ఛీ పొమ్మన్నా పోడు, ఆయనకో రాష్ట్రం ఉంది, రాజ్యం ఉంది, అక్కడి సమస్యలు పరిష్కరించలేక మన రాష్ట్రంలో ప్రతి దానికి కిరికిరి పెడుతున్నాడని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ సోమవారం నాటి బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
బాబుకు అక్కడ దిక్కులేదని, చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదని, డ్వాక్రా మహిళలకు రైతులకు రుణ మాఫీ అని చెప్పి గోల్ మాల్ చేశాడని ఆరోపించారు. తాము మాత్రం తెలంగాణలో చిత్తశుద్ధితో రుణమాఫీ అమలు చేశామని, ఆంధ్రలో అన్నీ అబద్ధాలే అన్నారు. సగం మందిని రుణమాఫీ జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.
డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. పక్క రాష్ట్రంలో అన్నీ మోసాలేనని, మీడియా మేనేజ్మెంట్ తప్ప అక్కడ ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ గుండెల్లో నిద్రపోతాను అంటున్నాడు కన్నతల్లికి అన్నపెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాను అన్నట్టు తన రాష్ట్రంలో ఏమీ చేయలేని వాడు మహబూబ్నగర్లో ఏదో మాట్లాడుతున్నాడని విమర్శించారు.
చంద్రబాబు నాలుగు పెంపుడు కుక్కలు ఏవో మొరుగుతున్నాయని అన్నారు. సికిందరాబాద్లో ఈ రోజు బహిరంగ సభలో బఠాణీలు అమ్మడానికి వచ్చినంతమంది కూడా బాబు మహబూబ్నగర్ సభకు రాలేదు. దానికే ఏదో చేసేసినట్టు బాబు హడావుడి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని కోరితే రాజధాని నగరంలో రైతులను కాల్చి చంపిన వారు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ వ్యాఖ్యల పైన చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పని చేసిన కేసీఆర్ ఈ రోజు తననే విమర్శించడం సరికాదని, ఆయన తీరు బాధిస్తోందని చంద్రబాబు అన్నారు. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారని, చేతనైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.
కేవలం ఆంధ్రా ప్రాంత అభివృద్ధి సరికాదు: టీజీ
కేవలం ఆంధ్రా ప్రాంత అభివృద్ధే సరికాదని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వేరుగా అన్నారు. ఆంధ్రా ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే తర్వాత రాయలసీమను తరిమేసే పరిస్థితి వస్తుందన్నారు. ఎర్రచందనం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సీమ అభివృద్ధికే కేటాయించాలన్నారు.