నోరు జారొద్దు, నేనొచ్చాక మాట్లాడుతా: కేశినేని నానికి నారా లోకేష్ ఫోన్
ప్రయివేటు బస్సులు, రవాణా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ ఫోన్ చేశారు.
విజయవాడ: ప్రయివేటు బస్సులు, రవాణా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ ఫోన్ చేశారు. బస్సుల వివాదంపై ఏం మాట్లాడవద్దని మంగళవారం ఫోన్ చేసి హితవు పలికారు.
నారా లోకేష్ పోర్చుగల్ నుంచి ఫోన్ చేశారు. తాను ఏపీకి వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడుదామని నానికి చెప్పారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై కేశినేని నాని యువనేతకు వివరణ ఇచ్చారు. తనకు పార్టీ, చంద్రబాబు, మీరు (లోకేష్) ముఖ్యమని చెప్పారు.
టిడిపిలో కలకలం: బాబును లాగిన కేశినేని, అది తప్పని అచ్చెన్న
తాను ఏపీకి వచ్చిన తర్వాత అన్ని విషయాలను మాట్లాడుతామని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తాను అన్ని విషయాలను తీసుకు వెళ్తానని, ఇప్పుడు మాత్రం నోరు జారవద్దని హితవు పలికారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులను ఏపీలో తిరగనివ్వరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 900 బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ లేని బస్సులు తిరిగితే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బస్సుల నెంబర్లు, ట్రావెల్స్ పేర్లు వెంటనే పంపించాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రయివేటు బస్సులు దక్షిణాది రాష్ట్రాల్లో పరుగులు పెడుతుంటాయి. వీటి వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుందనే వాదనలు ఉన్నాయి.