మా ఆస్తుల విలువ ఇదీ: ప్రకటించిన నారా లోకేష్, తెలంగాణకు రూ. 30 కోట్లు.
హైదరాబాద్: తమ కటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ శనివారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. తమకు ప్రధాన ఆదాయం హెరిటేజ్ నుంచే వస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆస్తిలో పెద్దగా మార్పు లేదని, బ్యాంకు బ్యాలెన్స్లు మాత్రం కాస్తా తగ్గాయని ఆయన చెప్పారు. నిరుడు ప్రకటించిన ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ రూ. 71 లక్షలు ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల విలువ రూ.42.40 లక్షలుగా ఉందని చెప్పారు.
తమ తల్లి భువనేశ్వరి దేవి ఆస్తుల విలువ కాస్తా పెరిగిందని, ఇప్పుడు ఆమె ఆస్తుల నికర విలువ రూ. 33 కోట్లుగా ఉందని ఆయన చెప్పారు. ప్రావిడెంట్ ఫండ్ కోటీ 28 లక్షల నుంచి కోటీ 46 లక్షలకు పెరిగిందని ఆయన చెప్పారు. తాను పది ఎకరాల భూమిలో ఫామ్ హౌస్ కట్టానని, అది గత సంవత్సరం నిర్మాణంలో ఉందని ఆయన చెప్పారు. తన అప్పులు రూ.3.54 కోట్లు తగ్గాయని ఆయన చెప్పారు. తన ఆస్తుల విలువ రూ. 7.56 కోట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.5.14 కోట్లు ఉందని ఆయన చెప్పారు.
తమకు హెరిటేజ్ ద్వారా ప్రధానంగా ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. ఈ కంపెనీని తాము 1992లో స్థాపించామని, దాని విలువ రూ.913 కోట్లు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో 15 ఏళ్లుగా హెరిటేజ్ పాలు అమ్ముతున్నామని, చాలా మంది వినియోగదారులు ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ. 30 కోట్లు పన్ను చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. హెరిటేజ్ నుంచి 2013 - 14 ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఆయన చెప్పారు.
హెరిటేజ్ టర్నోవర్ రూ.2,073 కోట్లు ఉందని, దానిలో రైతులకు 1238 కోట్ల రూపాయలు చెల్లించామని ఆయన చెప్పారు. తమ కంపెనీ ఏడు రాష్ట్రాల్లో పాలను సేకరిస్తోందని, 3 లక్షల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. తమ కంపెనీపై కాంగ్రెసు పాలనలో 35 కేసులు వేశారని, ఏ ఒక్కటి కూడా రుజువు కాలేదని ఆయన చెప్పారు.
తన తల్లి భువనేశ్వరి, బ్రాహ్మణి మాత్రమే కంపెనీని నడుపుతున్నారని ఆయన చెప్పారు. ఒక్క పద్ధతి ప్రకారం హెరిటేజ్ను నడుపుతున్నామని ఆయన చెప్పారు. రాజకీయాలను కొంత మంది అవినీతిమయం చేశారని, అందరూ ఆస్తులను ప్రకటిస్తే మంచిదని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వచ్చి ఆస్తులు ప్రకటిస్తే మంచిదని ఆయన అన్నారు.