ఫస్ట్ టైం మాట్లాడిన లోకేష్, టెక్మెంబర్షిప్, దేవినేని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గురువారం తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
25 లక్షల మంది కార్యకర్తలను నమోదు చేస్తామన్నారు. ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అండమాన్ నికోబర్ దీవులు, ఒరిస్సా రాష్ట్రాలలోను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ రాష్ట్రాలలో డిసెంబరులో చేపడతామని చెప్పారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సభ్యత్వం నమోదు అయ్యాక వారం రోడుల్లో సభ్యత్వ కార్డులు పంపిస్తామన్నారు. ఈసారి పేపర్ లెస్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. అందరికీ ట్యాబ్లు ఇచ్చినట్లు తెలిపారు.
25 లక్షల మంది పార్టీలో చేరితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరిస్తుందన్నారు. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, అండమాన్&నికోబార్ దీవుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పార్టీ సభ్యత్వ రుసుము కేవలం రూ.10లు అన్నారు. క్రియాశీలక సభ్యత్వానికి 100 రూపాయలను ఎంట్రీ ఫీజుగా ఉంటుందన్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.
కార్యకర్తల క్షేమం కోసమే సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డ కార్యకర్తలకు వైద్య సాయం అందిస్తామన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఇది ఆరు నెలలుగా పని చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా ఉంటుందన్నారు. కార్యకర్తల నుండి ఎనిమిదివేల వినతులు వస్తే అరవై శాతం పరిష్కరించామన్నారు.
లోకేష్ పైన దేవినేని నెహ్రూ ఆగ్రహం
నారా లోకేష్ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గురువారం నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణం విషయంలో అన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొత్త రాజధాని నిర్మాణం జరిగే ప్రదేశంలో లోకేష్ ముందుగానే భూములు కొని పెట్టుకున్నాడని ఆరోపించారు. వీటి ద్వారా లక్షల కోట్లు సంపాదించుకోవాలని చూస్తున్నాడన్నారు.