పల్లె తల్లి లాంటిది.. పట్నం ప్రియురాలు లాంటిది :లోకేష్
పల్లె జనంతో మాట్లాడుతూ.. పల్లెటూరు తల్లి వంటిదైతే, పట్నం ప్రియురాలు వంటిదని, తల్లి బిడ్డ కడుపును ఆప్యాయంగా రమ్మంటుందని, పట్నం తనకేమైనా తీసుకురమ్మంటుందని వ్యాఖ్యానించారు.
అమరావతి: మాస్ లీడర్గా జనంలో గుర్తింపు పొందాలంటే.. ఆకట్టుకునే వాక్చాతుర్యం తప్పనిసరి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు మాటకు పదును పెట్టకపోతే.. జనం దృష్టిలో తేలిపోతారు. సందర్భాన్ని బట్టి పిట్ట కథలను వల్లె వేయడం, అప్పటికప్పుడు కొత్త సామెతలను సృష్టించడం కేసీఆర్ వంటి నాయకులను జనాలకు ఎంత దగ్గర చేసిందో మనం చూసే ఉంటాం.
కాబట్టి రాజకీయాల్లో ప్రత్యర్థులను హడలెత్తించాలన్నా.. ప్రజలను ఆకట్టుకోవాలన్నా.. మాటపై పట్టు నిలుపుకోవాల్సిందే. తమదైన మార్క్ తో ప్రసంగాలు చేయాల్సిందే. సరే, ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇటీవలి కాలంలో అచ్చు తప్పులతో జనంలో మరీ చులకనైపోయిన ఏపీ మంత్రి లోకేష్.. ఇప్పుడిప్పుడే తన వాక్చాతుర్యాన్ని మెరుగుపెరుచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
మాట్లాడితే అచ్చు తప్పులేనా? అని జనం నిందిస్తుంటే ఇక మారక తప్పదని ఆయన కూడా భావిస్తున్నట్లున్నారు. తాజాగా మంత్రి హోదాలో తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా పర్యటించిన ఆయన.. జనాన్ని ఆకట్టుకునేలా వ్యాఖ్యలు చేశారు. పల్లె జనంతో మాట్లాడుతూ.. పల్లెటూరు తల్లి వంటిదైతే, పట్నం ప్రియురాలు వంటిదని, తల్లి బిడ్డ కడుపును ఆప్యాయంగా రమ్మంటుందని, పట్నం తనకేమైనా తీసుకురమ్మంటుందని వ్యాఖ్యానించారు.
పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఏకైక లక్ష్యంతోనే పంచాయితీ రాజ్ శాఖను స్వీకరించినట్టు లోకేష్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సిమెంట్ రోడ్లు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తానని అన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 2లక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.