'మహానాడు' భజన మొదలైంది?: లోకేశ్కు మంత్రి పదవి అంటూ కబుర్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశంగా భావించే మహానాడుకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఈ ఏడాది తిరుపతిలో తలపెట్టిన మహానాడు మూడు రోజుల కార్యక్రమానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతిలో ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రానికి సభా ప్రాంగణంతో పాటు డైనింగ్ హాళ్లు, ఫోటో ఎగ్జిబిషన్ కేంద్రాలు, రక్తదాన శిబిర ప్రాంగణం పూర్తయ్యాయి.
మహానాడు ప్రధాన వేదికతో పాటు మిగతా అలంకరణలు పూర్తి చేసి 25వ తేదీ రాత్రికల్లా సభా ప్రాంగణాన్ని భద్రతాధికారులకు అప్పగించనున్నారు. మహానాడుకు వేదికైన నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో మహానాడు సభా ప్రాంగణం పని చేసే కార్మికులతో పాటు పర్యవేక్షించే నాయకులతో కిటకిటలాడుతోంది.
అయితే ఈసారి జరగనున్న మహానాడులో మొత్తం 27 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించాలనే తీర్మానం కూడా ఉండటం విశేషం. దీంతో పాటు ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ను మంత్రి వర్గంలో తీసుకోనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
మహానాడు తర్వాత ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, నారా లోకేశ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. రెండు నెలల క్రితం నారా లోకేశ్ను రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిని చేయాలని అనుకొంటున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అంతేనా.. లోకేశ్ అవసరం ఢిల్లీ కంటే కూడా రాష్ట్రానికి ఎక్కువ మంది ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి మేం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. తాజాగా మళ్లీ మహానాడు సమావేశాలు రావడంతో లోకేశ్కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.
అది నిజమో కాదో తెలియాలంటే మహానాడు సమావేశాలు ముగిసేవరకు వేచి చూడక తప్పదు. ఒకవేళ నారా లోకేశ్ని మంత్రివర్గంలోకి తీసుకొంటే టీడీపీ మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు నేతలు అసంతృప్తికి గురి కావచ్చు. ప్రస్తుతానికి వారు మౌనంగా ఉన్న ఏదో ఒకరోజు వారు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారా లోకేశ్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, అది వారసత్వ ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయంగా నారా లోకేశ్ ఇప్పటి వరకు ఎటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీకి అందించిన దాఖలా లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ మాహానాడులో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.