విభేదాలకు తెరదించండి: మంత్రి, జిల్లా అధ్యక్షుడిపై లోకేష్ ఆగ్రహం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ప్రకాశం జిల్లా రాజకీయాలు తలనొప్పి మారాయి. అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్న ప్రకాశం టిడిపిలో కొత్త డీసీసీబీ అవిశ్వాస వ్యవహారంపై చినబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ఒకొకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని, అవిశ్వాసం వరకూ వెళ్లడంతో రంగంలోకి దిగిన లోకేష్.. జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడిని మందలించినట్లు సమాచారం. అంతేగాక, వారిద్దరి మధ్య రాజీ కుదర్చాలని ఆదేశించారట. దీంతో వైస్ ఛైర్మన్ రాజీనామా లేఖ చూపి డీసీసీబీ ఛైర్మన్ను బుజ్జగించి, గండం నుంచి గట్టెక్కించినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పార్టీలో ఇదే హాట్ టాపిక్గా మారింది.
అసలు విషయానికొస్తే.. ప్రకాశం జిల్లా డిసిసిబి ఛైర్మన్ ఈదర మోహన్, వైస్ ఛైర్మన్ మస్తానయ్య మధ్య కొద్దికాలం నుంచి అంతర్గత విభేదాలున్నాయి. ఈ క్రమంలో మస్తానయ్య అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఛైర్మన్, రాష్ట్ర సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. 10వ తేదీన అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి శిద్దారాఘవరావు, కరణం బలరాం, డి.జనార్దన్, ఎమ్మెల్యే సాంబశివరావులు మంత్రి బొజ్జలను కలసి అవిశ్వాసం లేకుండా స్టే తీసుకువచ్చారు.
దీనిపై ఆగ్రహించిన చైర్మన్ మోహన్ కోర్టుకెళ్లారు. మంత్రి ఇచ్చిన స్టే వర్తించదని, మళ్లీ అవిశ్వాసం పెట్టాలంటూ అధికారులను ఆదేశించడంతో మంగళవారం అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. కాగా, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన నేతలు గొట్టిపాటి రవి, అశోక్రెడ్డి, రామారావు కలసి ఈ వ్యవహారంపై లోకేష్కు ఫిర్యాదు చేశారు.
ఒకే పార్టీకి చెందిన నేతపై కుట్ర చేస్తున్నారంటూ చైర్మన్ మోహన్కు మద్దతుగా నిలిచారు. దీనితో పాతకొత్త నేతల మధ్య పోరు మొదలయింది. అయితే, కరణం-జిల్లా అధ్యక్షుడు జనార్దన్కు విబేధాలున్నట్లు తెలుస్తోంది. కొత్త ఎమ్మెల్యేలకు జనార్దన్ మద్దతునిస్తున్నప్పటికీ, డీసీసీబీ వ్యవహారంలో మాత్రం జనార్దన్, మంత్రి రాఘవరావు, కరణం, సాంబశివరావు మాత్రం వీసీ మస్తాన్కు బాసటగా నిలవడం విశేషం.
పార్టీ పరువు బజారుకెక్కే పరిస్థితి రావడంతో రంగంలోకి దిగిన లోకేష్.. మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా అధ్యక్షుడు జనార్దన్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తక్షణం చైర్మన్-వైస్ చైర్మన్ మధ్య రాజీ కుదిర్చి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం జనార్దన్.. చైర్మన్ మోహన్తో చర్చించారు.
అంతేగాక, నెలరోజుల తర్వాత వైస్ చైర్మన్తో రాజీనామా చేయిస్తామని చెప్పి, మంగళవారం ఉదయానికి వైస్ చైర్మన్ ఇచ్చిన రాజీనామా లేఖను చైర్మన్కు చూపించడంతో ఆయన శాంతించారు. దీంతో డీసీసీబీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలకు తెరదించినట్లయింది.