గర్వించేలా చేశారు: దేవినేని అవినాష్కు లోకేష్ మెచ్చుకోలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ను అభినందించారు.
గర్వించేలా చేశారు..
అమరావతిలో నిర్మించనున్న నూతన రాజధాని నిర్మాణంలో అవినాష్ భాగస్వామి కావాలనుకోవడం గర్వించదగిన విషయమని అన్నారు. నూతన రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో లక్ష రూపాయల డీడీని ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో నారా లోకేష్కు దేవినేని అవినాష్ అందజేశారు.
బాబు లక్ష్యం అదే..
లోకేష్ తోపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు అక్కడే ఉన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నారు.
మాట నిలబెట్టుకున్నా..
విశాఖపట్నంలో జరిగిన మహానాడులో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తనవంతు సాయంగా ఇస్తానని ప్రకటించిన లక్షరూపాయల విరాళాన్ని నేడు లోకేష్కు డీడీ రూపంలో అందజేయడం జరిగిందని దేవినేని అవినాష్ తెలిపారు.
రేపు నెహ్రూ జయంతి వేడుకలు..
యువతలో చైతన్యం వస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన తెలిపారు. కాగా, జూన్ 22న దేవినేని నెహ్రూ జయంతి వేడుకలను జరపనున్నారు.