ప్రతిపక్షానికి లోకేష్ ప్రశంస, జగన్కు హితవు: హెరిటేజ్ పదవికి రాజీనామా
పెద్దల సభలో తాను చిన్నవాడిని అని, నిన్న (గురువారం) శాసన మండలిలో ప్రతిపక్షం మంచి సలహాలు ఇచ్చిందని, మండలి జరిగినట్లు శాసన సభ జరగడం లేదని ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి: పెద్దల సభలో తాను చిన్నవాడిని అని, నిన్న (గురువారం) శాసన మండలిలో ప్రతిపక్షం మంచి సలహాలు ఇచ్చిందని, మండలి జరిగినట్లు శాసన సభ జరగడం లేదని ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీగా.. నారా లోకేష్ తడబాటు: మెట్టు వద్ద కాలుజారిపడ్డారు
ఈ విషయమై శాసన సభలో ప్రతిపక్షం(వైయస్సార్ కాంగ్రెస్) ఆలోచించాలని నారా లోకేష్ హితవు పలికారు. లోకేష్ గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మండలిలో తొలిసారి అడుగు పెట్టారు. రెండో రోజైన శుక్రవారం కూడా ఆయన మండలికి వచ్చారు.
ఈ సందర్భంగా టిడిఎల్పీ కార్యాలయం వద్ద కాసేపు మాట్లాడారు. 34 ఏళ్లకే సభలో అడుగు పెట్టానని, ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నానని చెప్పారు.
హెరిటేజ్ పదవికి లోకేష్ రాజీనామా
హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ పదవికి నారా లోకేశ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం లోకేశ్ శాసనమండలి సభ్యుడిగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే ఏప్రిల్ రెండో తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా అవకాశం దక్కనుంది.
తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి ఆధ్వర్యంలో హెరిటేజ్ సంస్థ ఉన్నత శిఖరాలకు వెళ్తుందని ట్విటర్లో లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల హెరిటేజ్ ప్రయాణంలో ఎన్నో విజయాలు అందుకోవడం సంతోషంగా ఉందని, ఇంతకాలం సహకరించిన సహచర డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు.