ఆస్తులు ధ్వంసం చేస్తామంటే అనుమతి ఇవ్వరు: జగన్ దీక్షపై నారా లోకేష్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. యువతను రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తామంటే దీక్షలకు అనుమతులు ఇవ్వరని ఆయన అన్నారు.
ఆయన శనివారం తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. తిరుపతిలో విద్యార్థులతో జగన్ భేటీ అయిన సమయంలోనే అదే ప్రాంతంలో 3 సెల్ఫోన్ కంపెనీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన వివరించారు.
ఇసుక ఆదాయం రూ.700 కోట్లకు పెంచామని లోకేష్ గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఇసుకలో రూ.7 వేల కోట్లు తినేశారని విమర్శించారు. రాజధాని, పట్టిసీమ ఇప్పుడు దేశంలోనే చర్చనీయ అంశాలని చెప్పారు. వారంలో పార్టీ కమిటీలను ప్రకటిస్తామని లోకేష్ తెలిపారు.
పదేళ్ల పాటు వ్యవహారాలను చక్కదిద్ది పాలనను గాడిలో పెట్టడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. హెరిటేజ్ సంస్థను ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించాలని అనుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తాము పన్ను కడుతున్నామని చెప్పారు.