'సాక్షి' స్మోకింగ్ కన్నా డేంజర్ అన్న లోకేష్: మళ్లీ నోరు జారి.. నీటి సమస్యపై..
స్మోకింగ్ కన్నా ఆ పత్రిక డేంజర్ అంటూ పరోక్షంగా సాక్షి పత్రికను మంత్రి నారా లోకేష్ టార్గెట్ చేశారు. రాయలసీమ, గోదావరి జిల్లాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని ఓ దొంగ పేపర్ కథనాలు రాస్తోందన్నారు.
కరప: ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నోటి వెంట మరోసారి తప్పులు దొర్లాయి. ఇంతకు ముందు అంబేడ్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అంటూ విమర్శలపాలైన లోకేష్.. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో నీటి సమస్యపై మాట్లాడుతూ నోరు జారారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో నిర్వహించిన టీడీపీ సభలో లోకేష్ మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 'రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యం' అని లోకేష్ అన్నారు. తాగు నీటి సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పాల్సింది పోయి.. లోకేష్ తడబాటుకు గురయ్యారు. దీంతో కరప వాసులంతా లోకేష్ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయారు.
కాబోయే సీఎం లోకేష్:
తూర్పుగోదావరి జిల్లా కరపలో పర్యటించిన సందర్బంగా మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం చినరాజప్ప.. కాబోయే సీఎం అంటూ అక్కడివారికి పరిచయం చేశారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం చినరాజప్పతో తనకు విబేధాలున్నాయని ఓ దొంగ పత్రిక కథనాలు రాస్తోందని లోకేష్ మండిపడ్డారు.
స్మోకింగ్ కన్నా ఆ పత్రిక డేంజర్:
స్మోకింగ్ కన్నా ఆ పత్రిక డేంజర్ అంటూ పరోక్షంగా సాక్షి పత్రికను మంత్రి నారా లోకేష్ టార్గెట్ చేశారు. రాయలసీమ, గోదావరి జిల్లాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని ఓ దొంగ పేపర్ కథనాలు రాస్తోందన్నారు. చినరాజప్పకు తనకు మధ్య విభేదాలు ఉన్నాయని దొంగ పేపర్ తప్పుడు వార్తలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమగ్ర రక్షిత మంచినీటి పథకం:
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కరప మండలంలోని రెండు చోట్ల రూ.12కోట్ల నిధులతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన 100మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
ప్రతిపక్ష పత్రిక బురద జల్లుతోంది:
టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షం, వారి పత్రికతో కలిసి బురదజల్లే ప్రయత్నం చేస్తోందని లోకేష్ ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఇప్పటికే రూ.6వేల కోట్లు ఇచ్చామని.. మరో రూ.4వేల కోట్లు త్వరలోనే చెల్లించనున్నామని చెప్పారు.