తట్టుకోలేవ్, ఏం జరిగినా జగన్ ఏ1: నారా లోకేష్ ఘాటు హెచ్చరిక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం పైన టిడిపి జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.
జగన్ దీక్ష సందర్భంగా ఒక్క ఆందోళన జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ఒక్కచోట ఆందోళన జరిగినా, దాని పైన కేసు పెట్టి జగన్ను ఏ-1గా చేర్చేదాకా పోరాడతామన్నారు. జగన్ దీక్షకు మద్దతుగా విధ్వంసం సృష్టిస్తామని కొద్ది రోజుల క్రితం ఓ నేత చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కార్యాలయ అద్దం పగిలినా, ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా, అందుకు జగన్నే బాధ్యుడిని చేసి కేసులో ఆయనను ఏ-1గా చేర్చేదాకా పోరాడుతామని, తమకు మీలాగా దొంగ ఛానెల్, పేపర్ లేవని, 55 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారని, మా వాళ్లు కళ్లు తెరిస్తే తట్టుకోలేవని జగన్ను ఉద్దేశించి లోకేశ్ వ్యాఖ్యానించారు.
శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం ఉదయం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
మిషన్ల ప్రాతిపదికగా బడ్జెట్: యనమల
ప్రభుత్వం నిర్దేశించుకున్న ఏడు మిషన్లు ప్రాతిపదికగా వచ్చే బడ్జెట్ ఉంటుందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి సచివాలయంలో ఆయన ఆర్థికశాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయాన్ని వచ్చే బడ్జెట్లో పెంచి ప్రణాళికేతర, రెవెన్యూ ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గిస్తామన్నారు. శాఖలు చేసే ఖర్చులను బట్టే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని, ఏయే శాఖ ఇప్పటివరకు ఎంతమేర ఖర్చు చేసిందో వివరాలు పంపాలని ఆదేశించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపుపై నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామన్నారు.