నారాయణ విద్యాసంస్థలపై ఐదేళ్ల బ్యాన్!: వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్..
లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని సభలో చర్చించవద్దంటూ అధికార పార్టీ చెప్పడం సిగ్గుచేటు విషయమన్నారు.
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ విద్యాసంస్థల హస్తముందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై తూతూ మంత్రంగా విచారణ జరిపించి చేతులు దులుపుకున్నారని, దర్యాప్తు వివరాలను బయటపెట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దీనిపై అధికార పక్షాన్ని గట్టిగా నిలదీశారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రంలో ఐదేళ్ల పాటు బ్యాన్ చేయాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ఒక మంత్రి పేపర్ లీక్ కాలేదని చెబుతుంటే.. మరో మంత్రి పేపర్ లీకైనట్లు చెబుతున్నారని.. ఎందుకిలా పొంతన సమాధానాలు చెబుతున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిల్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని సభలో చర్చించవద్దంటూ అధికార పార్టీ చెప్పడం సిగ్గుచేటు విషయమన్నారు. దీనిపై చర్చకు తామంతా పట్టుబడితే ఈ నెల 30న సీఎం ప్రకటన చేస్తారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
సభను రెండుసార్లు వాయిదా వేసిన స్పీకర్ తీరును ఎమ్మెల్యే అనిల్ తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత జగన్ రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరినా.. ఆయనకు మైక్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. లీకేజీపై జగన్ మాట్లాడితే దొంగలు దొరికిపోతారన్న భయం ప్రభుత్వంలో నెలకొందన్నారు. అటెండర్ ద్వారా ప్రశ్నాపత్రం లీకైందని ఒక మంత్రి, లేదు అసలు లీకేజీ జరగలేదని మరో మంత్రి చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
ఇక ఈ నెల 30న దీనిపై చంద్రబాబు స్పందిస్తారని అధికార పక్షం చెప్పడాన్ని అనిల్ కుమార్ తప్పుపట్టారు. ఫలితాలు వచ్చాక ప్రకటన చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీ చేసిన నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.