బాబుపై ‘302’ కేసు పెట్టాలి: నారాయణ ఫైర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సిపిఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. శేషాచలం ఎన్కౌంటర్ బూటకమని, కూలీలను అడవులకు తీసుకొచ్చి పోలీసులు చంపారని ఆరోపించారు. ఇంతపెద్ద ఎన్కౌంటర్ చంద్రబాబుకు తెలియకుండా జరగదని అన్నారు.
కూలీల హత్యల కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని, అతనిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. కూలీలు స్మగ్లింగ్ చేస్తుంటే పేదలుగా ఎందుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు.
ఇది అంతం కాదు ఆరంభమేనన్న అటవీశాఖ మంత్రి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని అన్నారు. మంత్రులే ఎన్కౌంటర్ను సమర్థిస్తే మేజిస్టిరియల్ విచారణలో ఏం తేలుతుందని ప్రశ్నించారు.
అధికార, ప్రతిపక్ష నేతలకు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని నారాయణ ఆరోపించారు. సూత్రధారులపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి లేదని అన్నారు. లక్ష ఎకరాల భూమిని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు. పేదలకు భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని నారాయణ హెచ్చరించారు.