ఆ విషయం లీక్ అవడం వల్లే నారాయణరెడ్డి హత్య, బాబు మద్దతుతోనే ఇదంతా: రోజా
ఆయుధాలు లేవన్న విషయం పోలీసుల వద్ద నుంచి లీక్ అయింది కాబట్టే.. ప్రత్యర్థులు ఆయన్ను లేపేందుకు పక్కా స్కెచ్ గీశారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
కర్నూలు: జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి పడగవిప్పడం.. ఆధిపత్య రాజకీయాలతో ఈ హత్యలు ముడిపడి ఉండటం.. ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను సృష్టిస్తున్నాయి. పత్తికొండ వైసీపీ ఇన్చార్జీ నారాయణరెడ్డి హత్యతో ఈ రెండు పార్టీల మధ్య వైరం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య: హత్యలోని కోణాలివే!..
హత్య వెనుక టీడీపీ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజా సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆరోపించగా.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాత్రం ఆరోపణలను కొట్టిపారేశారు. హత్యలో తన అనుచరులకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒకవేళ ఉన్నట్లు తేలితే కఠినంగా శిక్షిస్తామన్నారు.
చంద్రబాబు మద్దతుతోనే:
ఎమ్మెల్యే రోజా మాత్రం హత్యలో టీడీపీ ప్రమేయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మద్దతుతోనే నారాయణరెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. హత్యలో కేఈ కుటుంబ హస్తం ఉందని, వైసీపీ బలపడటాన్ని చూసి సహించలేకనే ఈ హత్యా రాజకీయాలకు తెరలేపారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయం ఎలా లీక్ అయింది?
తన ఆయుధాన్ని రెన్యువల్ చేయాలని చాలా కాలం నుంచి నారాయణరెడ్డి పోలీసులను కోరుతున్నా.. ఆయన అభ్యర్థనను కావాలనే పట్టించుకోలేదన్నారు రోజా. ఆయన వద్ద రివాల్వర్ లేని సమయం చూసి దాడికి పాల్పడ్డారన్నారు. అయితే నారాయణ రెడ్డి వద్ద ఆయుధం లేని విషయం పోలీసులకు మాత్రమే తెలుసని, ప్రత్యర్థులకు అదెలా లీక్ అయిందని రోజా ప్రశ్నించారు.
పక్కా స్కెచ్తో:
ఆయుధాలు లేవన్న విషయం పోలీసుల వద్ద నుంచి లీక్ అయింది కాబట్టే.. ప్రత్యర్థులు ఆయన్ను లేపేందుకు పక్కా స్కెచ్ గీశారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టీడీపీ నేతలు, స్థానిక పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక తతంగం నడిపించినట్లుగా ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
పచ్చ చొక్కాలు వేసుకున్న తరహాలో:
పోలీసులే విషయాన్ని లీక్ చేయడంతో.. ప్రత్యర్థులు నారాయణరెడ్డిపై దాడి చేసి హత్య చేశారన్నారు. మొత్తం వ్యవహారంలో పోలీసులు పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తుల్లా వ్యవహారించారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు.