తెలంగాణలో మోడీ పర్యటన ఖరారు: ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 7న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నాం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయానికి వస్తారు.
అక్కడ ప్రధాని మోడీకి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం పలకనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో 1.45 నిమిషాలకు కరీంనగర్ జిల్లాలోని రామగుండంకు బయల్దేరతారు. అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు.
ఆ తర్వాత పక్కనే రామగుండం ఫర్టిలైజర్స్కు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్కు ప్రయాణమవుతారు. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు పైలాన్ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఆ తర్వాత ఆదిలాబాద్ వెళ్తారు. ఆదిలాబాద్లోని జైపూర్లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు. మోడీ రాక సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు.