'అమరావతి' నిర్మాణంపై ప్రభుత్వానికి నోటీస్, ఆపలేం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తిరస్కరించింది. అదే సమయంలో పర్యావరణ ప్రభావ మదింపు జరపాలన్న అంశంపై విచారణను జూలై 27కి వాయిదా వేసింది.
ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాలు సారవంతమైన సాగుభూములని, కృష్ణానది ఒడ్డున రాజధానిని నిర్మిస్తే వరదలు వస్తాయని కాబట్టి ఈ ప్రక్రియను నిలువరించి, పర్యావరణ ప్రభావ మదింపు జరిపించాలంటూ విజయవాడకు చెందిన పందలనేని శ్రీమన్నారాయణ ఎన్జీటీని ఆశ్రయించారు.
జస్టిస్ యూడీ సాల్వి, జస్టిస్ ఎన్ఎస్ నంబియార్, నిపుణులు డాక్టర్ దేవేంద్ర కుమార్ అగర్వాల్, ఆచార్య ఏఆర్ యూసుఫ్, బిక్రంసింగ్ సజ్వన్తో కూడిన విస్తృత ధర్మాసనం ఆ పిటిషన్ను తోసిపుచ్చారు.
పర్యావరణ ప్రభావ మందింపు జరపాలన్న అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసు ఇచ్చింది. జూలై 27కు తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాజధాని నిర్మాణ ప్రాంతానికి తీవ్రమైన వరద, భూకంప ముప్పు పొంచి ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం నిర్మాణం చేపడుతోందని పిటిషన్లో పేర్కొన్న్ారు. రాజధాని నిర్మాణం వల్ల కలిగే పర్యావరణ ప్రభావం గురించి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కాగా, ఏపీ రాజధాని నిర్మాణం భూమిపూజకు వేదిక ఖరారైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లాయపాలెం - మందడం గ్రామాల మధ్య సిమెంట్ రోడ్డుకుతూర్పు ముఖంగా ఉన్న సర్వే నెంబర్ 136లోని భూముల్లో భూమిపూజ చేసేందుకు ప్రముఖ వాస్తు సిద్ధాంతి రాఘవేంద్ర స్థలాన్ని ఎంపిక చేశారు.