మోడీ ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత, 2019లోను ఆయన వెంటే: ఆకాశానికెత్తిన బాబు
ప్రస్తుతం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ద్వారా ప్రధానమంత్రికి ప్రజల మద్దతు ఉందని తేలిపోయిందని చంద్రబాబు అన్నారు.
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని, అలాగే దేశంలోని మోడీ హవా నడుస్తోందని, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ద్వారా ప్రధానమంత్రికి ప్రజల మద్దతు ఉందని తేలిపోయిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.
మోడీ ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత అన్నారు. ఆయనలాంటి ప్రధాని మరొకరు లేరని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచారని చెప్పారు. 2019లోను ఆయన నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు.
ఢిల్లీలో ఎన్డీయే పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎన్డీయేలోని 33 పార్టీలు హాజరయ్యాయి. శివసేన కూడా హాజరైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. విదేశాల్లో భారత ఖ్యాతిని, బ్రాండును ప్రధాని మోడీ పెంచారని కితాబిచ్చారు.
కీలక నిర్ణయాలు
అన్ని రంగాల్లో ఎన్డీయే కీలక నిర్ణయాలు తీసుకుంటోందని చంద్రబాబు చెప్పారు. సుస్థిర పాలనకు రెండంకెల వృద్ధి రేటుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జీఎస్టీ, డిజిటలైజేషన్, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మోడీ తీసుకున్నారని కితాబిచ్చారు.
మొదటిసారి ప్రపంచం చూస్తోంది
ఎన్డీయే నేతల రెండో సమావేశం ఢిల్లీలో ఈ రోజు జరిగిందని, మొదటిసారి కాంగ్రెస్సేతర ప్రధానికి పూర్తి మద్దతు లభించిందని చంద్రబాబు అన్నారు. మొదటిసారి ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, దానికి మోడీయే కారణమన్నారు.
మోడీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల్లేవు
గడిచిన మూడేళ్లలో ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఇది ఈ ప్రభుత్వ విజయమన్నారు. నోట్లరద్దు, డిజిటలైజేషన్, జీఎస్టీ, డిజిటల్ పేమెంట్స్ అతిపెద్ద విజయాలన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పారు.
రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించలేదు
గత ప్రభుత్వాలు జాతీయ రహదారులను పూర్తి చేయడంలో వైఫల్యం చెందాయన్నారు. రెండంకెల వృద్ధిరేటును సాధించగలిగేది ఒక్క భారత్ మాత్రమేనన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై సమావేశంలో చర్చించలేదన్నారు.
యూపీ ఎన్నికల తర్వాత పెద్దదైన ఎన్డీయే
ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్లలో ఎన్డీయే విస్తరించిందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మోడీ నేతృత్వంలో ఎన్డీయేకు అపూర్వ మద్దతు లభిస్తోందని, తమ ప్రభుత్వం పేదల పక్షాన పని చేస్తోందన్నారు. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీయే సమూహం పెద్దదైందన్నారు. అన్ని రాష్ట్రాల్లో 33 పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నట్టు చెప్పారు.
శివసేన హాజరు
ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్యపక్ష నేతలంతా హాజరై మాట్లాడినట్టు జైట్లీ తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్యపక్ష నేతలంతా చర్చించిన తర్వాత తీర్మానాన్ని ఆమోదించనున్నట్టు చెప్పారు. దేశ ఆర్థికవ్యవస్థను ఎన్డీయే బలపర్చిందని, అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఎన్డీయేను సుస్థిరపరచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు జైట్లీ తెలిపారు. నేటి సమావేశంలో శివసేన పాల్గొనడం మంచి పరిణామామన్నారు.